
సాక్షి, న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టంచేశారు. రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో తాజా పరిణామాలతో బీజేపీ ఎదుగుదలను, దిగజారుతున్న టీఆర్ఎస్ గ్రాఫ్ కారణంగానో లేక కుటుంబ వారసత్వ రాజకీయాల ఒత్తిడి కారణంగానో కేసీఆర్ మానసిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం అర్వింద్ ఒక వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ ఇంట్లో వారసత్వ పోరు మొదలైందని తెలిపారు. శనివారం వరద ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తెలంగాణపై విదేశాలు కుట్ర పన్ని క్లౌడ్ బరస్ట్ చేయడంతో వరదలు సంభవించాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని అన్నారు.