కౌంట్‌డౌన్‌ 520 రోజులే  | Telangana BJP Incharge Tarun Chugh Fires On CM KCR | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ 520 రోజులే 

Jul 2 2022 2:31 AM | Updated on Jul 2 2022 7:00 AM

Telangana BJP Incharge Tarun Chugh Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ 520 రోజులేనని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ రాక సందర్భంగా ఆయన్ను ఆహ్వానించేందుకు పార్టీ నాయకులతో కలిసి విమానాశ్రయానికి వచ్చిన తరుణ్‌ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పార్టీ అగ్రనేతలంతా వస్తున్నారని తెలిపారు.

ప్రధాని మోదీ ఈ సమావేశాల్లో, విజయ సంకల్ప్‌ సభలో బీజేపీ ప్రణాళికను వెల్లడిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయంతో ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 71 రోజుల పాటు నిర్వహించిన ప్రజా సంగ్రామయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారని ఆనందం వ్యక్తంచేశారు.

బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మూడు రోజుల పాటు 119 నియోజకవర్గాల్లో ప్రజల స్పందనను తెలుసుకుంటున్నారని, వారి మద్దతు కోరుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పాల్గొనే బీజేపీ సభను భారీ ఎత్తున జయప్రదం చేసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారని తరుణ్‌ చుగ్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement