Supreme Court to hear Congress leader Rahul Gandhi's Plea: Updates - Sakshi
Sakshi News home page

సుప్రీంలో రాహుల్‌ గాంధీ పిటిషన్‌.. పలువురికి నోటీసులు.. బెంచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jul 21 2023 11:53 AM | Updated on Jul 21 2023 1:29 PM

SC begins hearing Congress leader Rahul Gandhi Plea Updates - Sakshi

రాహుల్‌ గాంధీ విషయంలో 100 పేజీల తీర్పు ఇచ్చిన గుజరాత్‌ హైకోర్టు.. 

ఢిల్లీ: ‘మోదీ ఇంటిపేరు’ Modi surname కేసులో రెండేళ్ల జైలుశిక్షపై స్టే కోరుతూ..  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ పిటిషన్‌ ఆధారంగా.. పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ ఈశ్వర్‌బాయ్‌ మోదీతో పాటు  గుజరాత్‌ ప్రభుత్వానికి, మరికొందరు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.  అలాగే..

జులై 7వ తేదీన గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌ గాంధీ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పు 100 పేజీలు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. గుజరాత్‌ హైకోర్టు నుంచి  చిత్రవిచిత్రాలు చూస్తున్నామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ మేరకు నోటీసులకు స్పందన నేపథ్యంలో.. రాహుల్‌ గాంధీ పిటిషన్‌పై ఆగష్టు 4వ తేదీన వాదనలు వింటామని తెలిపింది బెంచ్‌. 

మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావా కేసులో గుజరాత్‌ సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై స్టే విధించేందుకు గుజరాత్‌ హైకోర్టు ఇంతకు ముందు నిరాకరించింది.  ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో జులై 15వ తేదీన రాహుల్‌ గాంధీ రివిజన్‌ పిటిషన్‌ వేశారు. 

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారణకు స్వీకరించింది. అంతకు ముందు జస్టిస్‌ గవాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరువైపుల నుంచి తనకు కాస్త ఇబ్బందికరపరిస్థితులు ఉన్నాయని, తన తండ్రి కాంగ్రెస్‌ సభ్యుడు కాకపోయినా.. ఆ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే తన సోదరుడు కాంగ్రెస్‌లోనే ఉన్న విషయం గుర్తు చేయగా.. అందుకు రాహుల్‌ తరపు న్యాయవాది సింఘ్వీ నుంచి, మరో తరపు న్యాయవాది మహేష్‌ జెఠల్మానీ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. దీంతో ఆగష్టు 4వ తేదీన గుజరాత్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం బెంచ్‌ వాదనలు విననుంది.

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక కోలార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ అనే పదం ప్రస్తావన తెచ్చి ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూరత్‌ కోర్టు ఈ క్రిమినల్‌ పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

ఆ మరుసటి రోజు అంటే మార్చి 24వ తేదీన ఆయన లోక్‌సభ స్థానంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్‌ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్‌సభ కార్యదర్శి ప్రకటించారు.   తక్షణం వేటు అమలులోకి వస్తుందని ప్రకటించారు. అయితే బెయిల్‌ దక్కించుకున్న రాహుల్‌ గాంధీ తన శిక్షపై స్టే తెచ్చుకోవడం ద్వారా.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 


బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ

ఈ క్రమంలో గుజరాత్‌ సెషన్స్‌ కోర్టు ఆయనకు శిక్షపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీంతో గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారాయన.  జులై 7వ తేదీన గుజరాత్‌ హైకోర్టు ఆయన రివ్యూ పిటిషన్‌పై స్పందిస్తూ.. దిగువ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి(స్టే విధించడానికి) రాహుల్‌ గాంధీ చూపించిన కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. అందరుదైన సందర్భాల్లో మినహా శిక్షపై స్టేవ ఇవ్వడం తప్పనిసరేం కాదు. ఆయనపై ఇప్పటికే 10 కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత కేసులో ఆయనకు కింది కోర్టు శిక్ష విధించడం సరైందే.. అలాగే న్యాయబద్ధమైందే. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం అని వంద పేజీలతో కూడిన తీర్పు ఇచ్చింది. 

సెషన్స్‌ కోర్టు, గుజరాత్‌ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఒకవేళ శిక్ష గనుక రద్దు అయితే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యే ఛాన్స్‌ ఉంది. లేకుంటే ఆరేళ్ల దాకా ఆయన ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.

ఇదీ చదవండి: లైంగిక దాడి కేసు.. జైల్లో తక్కువ, బయటే ఎక్కువ!

Advertisement
 
Advertisement
Advertisement