
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని.. ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడకు రావాల్సిన ఉన్నా.. కశ్మీర్కు వెళ్లడంతో రాలేకపోయాయన్నారు.
పాతతరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని.. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచానన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వాదన వినిపించేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నా పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నాను. ఎంతో మందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇండియాలో నూతన రాజకీయాలను నిర్మిద్దాం. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసాగిద్దాం. పాదయాత్రలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టాను. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారుల్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానని స్లోగన్ తీసుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.
అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం: సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ సమ్మిట్లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ అన్నారు.