అర్బన్ నక్సల్స్‌ గుజరాత్‌లో పాగా వేయాలని చూస్తున్నారు.. జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

మారువేషంలో వస్తున్న అర్బన్‌ నక్సల్స్‌తో జాగ్రత్త.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Published Mon, Oct 10 2022 2:55 PM

PM Modi Says Urban Naxals Trying To Enter Gujarat Be Careful - Sakshi

గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సలైట్లు కొత్త వేశంతో గుజరాత్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. యువతను నాశనం చేసే వాళ్లను గుజరాతీలు రాష్ట్రంలోకి రానివ్వరని పేర్కొన్నారు.  దేశంలోనే తొలి బల్క్ డ్రగ్ పార్కను భారుచ్ జిల్లాలో ప్రారంభించిన అనంతరం ఓ ర్యాలీకి హాజరై మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

'అర్బన్ నక్సలైట్లు గుజరాత్‌లోకి రావాలని చూస్తున్నారు. వాళ్ల వేషధారణ మార్చుకున్నారు. శక్తిమంతమైన యువతను తప్పుదోవ పట్టించి వాళ్లవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. యువతరం జీవితాలను నాశనం చేసే వారిని రాష్ట్రంలోకి రానివ్వొద్దు. దేశాన్ని నాశనం చేయడమే వాళ్ల లక్ష‍్యం. వాళ్లు విదేశీ శక్తుల ఏజేంట్లు. అలాంటి వాళ్ల ముందు గుజరాత్ తలవంచదు. వాళ్లను నాశనం చేస్తుంది.' అని మోదీ అన్నారు.

తాను 2014లో ప్రధాని అయినప్పుడు ప్రపంచ ఆర్థిక ర్యాంకుల్లో భారత్ 10 స్థానంలో ఉందని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు ఇంకా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ఐదో ర్యాంకుకు చేరుకుందని పేర్కొన్నారు.

అయితే మోదీ అర్బన్ నక్సలైట్లు అని పరోక్షంగా చెప్పింది ఆమ్‌ ఆద్మీ పార్టీని ఉద్దేశించే అని స్పష్టంగా తెలుస్తోంది. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ చూస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తరచూ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ప్రజలు, ప్రత్యేకించి యువతపై హామీల వర్షం కురిపిస్తున్నారు. 27ఏళ్ల బీజేపీ పాలనతో రాష్ట్ర  ప్రజలు విసిగిపోయారని, మార్పు కోసం తమవైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ఆప్‌తో జాగ్రత్తగా ఉండాలని గుజరాతీలకు సూచించారు.
చదవండి: ములాయం కన్నుమూత.. ప్రధాని భావోద్వేగం

Advertisement
Advertisement