Shashi Tharoor: కాంగ్రెస్‌-శశిథరూర్‌ విభేదాల్లో ట్విస్ట్‌ | Ongoing Differences Between Congress And Shashi Tharoor | Sakshi
Sakshi News home page

Shashi Tharoor: కాంగ్రెస్‌-శశిథరూర్‌ విభేదాల్లో ట్విస్ట్‌

Jun 20 2025 3:03 PM | Updated on Jun 20 2025 3:41 PM

Ongoing Differences Between Congress And Shashi Tharoor

తిరువనంతపురం: కాంగ్రెస్‌ వర్సెస్‌ ఆ పార్టీ కేరళ ఎంపీ శశి థరూర్‌ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకు నీలంబూర్‌ బై పోల్‌ ఎలక్షన్‌ ప్రచారం వేదికగా మారింది. మలయాళ సినీ ప్రముఖుడు ఆర్యదన్ షౌకత్ నీలంబూర్‌ బై ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేశారు. ఆ ఎన్నిక కోసం కేరళ కాంగ్రెస్‌ యూనిట్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఎంపీ శశిథరూర్‌ పేరు సైతం ఉందని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌ చెబుతున్నారు.

కానీ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ శశిథరూర్‌ చెప్పడం విశేషం. పార్టీ నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఎవరూ అడిగింది లేదు. ఎన్నికల ప్రచారం, స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా గురించి నాకు ఫోన్‌ చేసింది లేదు. అయినప్పటికీ, ఆర్యధన్‌ షౌకత్‌ తరుఫున పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో ఎక్కువ భాగం విదేశాలలో అధికారిక దౌత్య పర్యటనలో ఉన్నాను’ అని చెప్పారు.    

అయితే, శశిథరూర్‌ పై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సన్నీ జోసెఫ్‌ ఘాటుగా స్పందించారు. ‘నీలంబూర్ ఉప ఎన్నికలో భాగంగా ఆర్యదన్ షౌకత్ తరుఫున ప్రచారం చేసేందుకు స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశాం. ఆ జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాం. శశిథరూర్‌ ఆయన ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఎక్కువ శాతం విదేశాల్లో తిరుగుతుంటారు. లేదంటే ఢిల్లీలో ఉంటారు. కేరళ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేనని ముగించారు. గురువారం శశిథరూర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. ఆ విభేదాలేంటి? అనే అంశాన్ని దాట వేశారు.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు భారత్‌ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా  ప్రపంచ దేశాల ఎదుట పాక్‌ను దోషిగా నిలబెట్టేలా కేంద్రం అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు స్థానం కల్పించింది. నాటి నుంచి కాంగ్రెస్‌-ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ఏర్పాటు  చేసిన అఖిలపక్ష బృందం విదేశీ పర్యటన సమయంలో శశిథరూర్‌ ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపిందంటూ ప్రశంసలు కురిపించారు. శశిథరూర్‌ చేసిన ఆ వ్యాఖ్యలే కాంగ్రెస్‌ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అంతర్ఘతంగా శశిథరూర్‌ను తీరును పార్టీ పెద్దల ఎదుట తప్పుబట్టినట్లు సమాచారం. తాజాగా, కేరళలో జరిగిన ఉప ఎన్నికకు శశిథరూర్‌కు ఎటువంటి ఆహ్వానం అందకపోవడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement