ఢిల్లీ రైతు ఉద్యమంతో మీది పోలికా!?

Nandigam Suresh Fires On Chandrababu Naidu - Sakshi

చంద్రబాబుపై ఎంపీ నందిగం మండిపాటు 

సాక్షి, అమరావతి: బినామీ భూముల కోసం పెయిడ్‌ ఆర్టిస్టులతో అమరావతిలో చంద్రబాబునాయుడు చేస్తున్న డ్రామాను.. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంతో పోల్చడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నందిగం సురేష్‌ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు ఇది పరాకాష్టని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ఓ పార్టీ ప్రయోజనాలను ఆశించి, చంద్రబాబు బినావీులు.. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసం జరుగుతున్న దానినీ పోరాటం అనడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఇళ్ల పట్టాలను అడ్డుకోవడం ఘోరం
తమ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే.. కోర్టుకెళ్ళి అడ్డుకోవడం దారుణమన్నారు. వీరిలో దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారని.. వీరందరికీ చంద్రబాబు శత్రువేనని నందిగం మండిపడ్డారు. రెండు పత్రికలు, మూడు టీవీ ఛానళ్లు కలిసి చంద్రబాబు అమరావతి పోరాటంపై  ఊదరగొట్టినంత మాత్రాన రైతులు ఎవరు?, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఎవరు? చంద్రబాబు బినామీలు ఎవరో ప్రజలు తెలుసుకోలేని అవివేకులు కారన్నారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు ద్రోహిగానే చరిత్రలో మిగిలిపోతారని.. మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన ఆయనను రైతులవరూ నమ్మరని నందిగం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు, నాలుగు పంటలు పండే భూములను తన స్వార్ధం కోసం బలవంతంగా లాక్కున్న రైతు ద్రోహి చంద్రబాబు

అని ఆయన దుయ్యబట్టారు. భూములివ్వని రైతుల తోటలు, పశువుల పాకలు తగులబెట్టించాడని, కేసులు పెట్టి కన్నీళ్లు తెప్పించిన దుర్మార్గుడని ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి రైతులను వంచించాడని.. ఇలాంటి వ్యక్తి సంక్రాంతికి పంచె కట్టి, తానూ రైతునని చెబితే రాష్ట్రంలో ఏ రైతు నమ్మడంలేదని నందిగం సురేష్‌ ఎద్దేవా చేశారు. రైతు అన్న పదం పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top