న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాల ఫలితాలతో పాటు మిగతా రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలపై ఆయన ట్వీట్లు చేశారు.
“పశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజాశక్తి విజయం సాధించింది. బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి. పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను. ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను.
సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలు, గౌరవం కల్పించే ప్రభుత్వాన్ని అందిస్తాము. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయం అనేక తరాలుగా కష్టపడి పనిచేసిన అనేక మంది కార్యకర్తల ప్రయత్నాలు, పోరాటాలు లేకుండా సాధ్యమయ్యేది కాదు. వారందరికీ నేను వందనం చేస్తున్నాను. ఏళ్ల తరబడి వారు కష్టపడి పని చేశారు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు, మా అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారు మా పార్టీకి అసలైన బలం’’ అని తెలిపారు.
టీవీకేకు అభినందనలు
‘‘తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు. ప్రజల సమస్యల పరిష్కారం, వారి జీవన పరిస్థితుల మెరుగుదలలో మేము ఎప్పుడూ ముందుండి పని చేస్తాము. టీవీకే అద్భుత ప్రదర్శనకు అభినందనలు. కేంద్రం తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుతుంది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.
అస్సాంలో వారి కృషి వల్లే..
“అస్సాం మరోసారి బీజేపీ-ఎన్డీఏను ఆశీర్వదించింది. అస్సాం విధాన్ సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్డీఏ విజయం సాధించడం, మా కూటమి అభివృద్ధిపై పెట్టిన దృష్టి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలన్న ప్రయత్నాలకు ఉన్న అచంచల విశ్వాసాన్ని చూపిస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చినందుకు అస్సాంలోని నా సోదరులు, సోదరీమణులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలో మార్పు కోసం మేము నిరంతరం పనిచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. అస్సాం ప్రజల మధ్య నిరంతరం కృషి చేసిన బీజేపీ-ఎన్డీఏ కార్యకర్తలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గత దశాబ్దంలో మా పార్టీ కూటమి ఎంతగా ఎదిగిందో చూడటం ప్రశంసనీయమైన విషయం. వారి కృషి వల్లే మా సానుకూల అజెండా ప్రజల మనసులను తాకింది’’ అని అన్నారు.
కేరళ గురించి..
‘‘కేరళలో ఎన్డీయేకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేరళ పురోగతికి, వికసిత కేరళ లక్ష్యం సాధన కోసం కష్టపడతాము. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధించినందుకు అభినందనలు’’ అని మోదీ చెప్పారు.
ప్రభుత్వ పనితీరు ఆధారంగా తీర్పు
‘‘పుదుచ్చేరికి ధన్యవాదాలు. మంచి పాలనలో మా గత అనుభవం, ఎన్.రంగస్వామి నాయకత్వంలోని ప్రభుత్వ పని ఆధారంగా పుదుచ్చేరి ప్రజలు ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ ఆశీర్వాదం మా సుపరిపాలనను బలపరచే ప్రయత్నాలకు ఊతం ఇస్తుంది’’ అని చెప్పారు.


