'షార్ట్‌కట్‌లో సులభంగా ఓట్లు సాధించవచ్చు.. అది దేశానికే..!'

It is easy to fetch votes through shortcuts Prime Minister Narendra Modi - Sakshi

రాంచీ: షార్ట్‌కట్‌లో ఓట్లు సంపాదించడం సులభమే కానీ, ఆ తరహా రాజకీయాలు దేశాన్నే నాశనం చేస్తాయని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. షార్ట్‌కట్‌ రాజకీయాలకు పాల్పడేవారు ఎప్పటికీ కొత్త విమానాశ్రయాలు, రహదారులు, ఎయిమ్స్‌లు నిర్మించలేరని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. ఝార‍్ఖండ్‌లోని దేవఘర్‌లో సుమారు రూ.16,800 కోట్లతో చేపట్టిన నూతన విమానాశ్రయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ.  

అనంతరం దేవఘర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. 'షార్ట్‌కట్‌ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతం ఈ షార్ట్‌కట్‌ రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయి. అలా ఓట్లు సులభంగా సాధించవచ్చు. ఒక దేశంలోని రాజకీయాలు షార్ట్‌కట్‌పై ఆధారపడితే.. అది షార్ట్‌ సర్క్యూట్‌కు దారి తీస్తుంది. అలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను కోరుతున్నా. అలా షార్ట్‌కట్‌ రాజకీయాలకు పాల్పడేవారు దేశాభివృద్ధి కోసం పనిచేయలేరు.' అని పేర్కొన్నారు మోదీ. 

దేవఘర్‌లో విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు తనకు అవకాశం లభించిందని, ఈరోజు అదే ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు మోదీ. గతంలో ప్రాజెక్టులు ప్రకటించటం.. 2-3 ప్రభుత్వాలు మారాక శంకుస్థాపన చేయటం జరిగేదన్నారు. అలా కొన్ని ప్రభుత్వాలు మారాకే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని విమర్శలు గుప్పించారు. భారత్‌ భక్తి, ఆధ్యాత్మికత, పుణ్యక్షేత్రాలకు నిలయమని పేర్కొన్నారు. తీర్థయాత్రలు మనల్ని మెరుగైన సమాజంగా, మంచి దేశంగా తీర్చిదిద్దుతాయన్నారు. దేవఘర్‌లో జ్యోతిర్లింగంతో పాటు మహాశక్తి పీఠం ఉందని గుర్తు చేశారు. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు దేవఘర్‌కు వచ్చి మహాశివుడిని దర్శించుకుంటారని తెలిపారు. 

ఇదీ చూడండి: దిల్లీ- ముంబైల మధ్య 'ఎలక్ట్రిక్‌ హైవే'.. దేశంలోనే తొలిసారి!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top