
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చిన ప్రజాపాలన డొల్లగా మారి, ప్రజాపీడన జరుగుతోందని, ప్రజావాణి ఉత్త ప్రహసనంగా తేలిపోయిందని మాజీ మంత్రి టి.హరీశ్రావు(Harish Rao) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతీరోజూ ప్రజాదర్భార్ నిర్వహిస్తామని ప్రకటించి, ప్రజావాణిగా పేరు మార్చారన్నారు. ఏడాది కాలంలో సీఎం రేవంత్(Revanth Reddy) కేవలం ఒక్కసారి మాత్రమే ప్రజావాణికి హాజరై.. పది నిమిషాల పాటు పాల్గొన్నారన్నారు. గాం«దీభవన్కు వెళ్తున్న మంత్రులకు ప్రజావాణికి వచ్చే తీరిక లేదని ఎద్దేవా చేశారు. ప్రజావాణిపై ఆర్టీఐ చట్టం కింద సేకరించిన సమాచారంలో ఈ కార్యక్రమం ప్రహసనంగా మారిన వైనం బయటపడిందన్నారు. ఈ మేరకు హరీశ్రావు(Harish Rao) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ప్రజావాణిని చివరకు ఔట్ సోర్సింగ్(Outsourcing) ఉద్యోగులతో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు జరుగుతున్న ప్రజావాణిలో దరఖాస్తుల సమర్పణ వృథా ప్రయాస అనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ (సమస్యలు) కిందకు వస్తాయని మిగతావి వాటి పరిధిలోకి రావని ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అధికారులు సమాచారం ఇచ్చారు. అలాగే పరిష్కారం అయినట్లుగా చెపుతున్న దరఖాస్తుల్లో చాలా వరకు అపరిష్కృతంగా ఉన్నట్లు క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి’అని పేర్కొన్నారు. వ్యయ, ప్రయాసలకోర్చి హైదరాబాద్కు వచ్చిన ప్రజలకు న్యాయం జరగడం లేదని హరీ‹Ùరావు విమర్శించారు.