‘గస్తీ కాసేవాళ్లకు ఓటు వేయండి’
సాక్షి, హైదరాబాద్: దుబ్బాకలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. అగ్ర నాయకులందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అల్వాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. వెంకటాపురం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ కుమార్ను గెలిపించాల్సిందిగా జనాలను అభ్యర్థించారు. బస్తీలకు గస్తీ కాసే వాళ్ళకి ఓటు వేయండని కోరారు. టీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత వ్యవహారాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
కరోనా, వరదల సమయంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఇది అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల కోసం పోరాడుతున్నా.. చదువుకున్న వ్యక్తులకు ఓటువేయలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.