స్కూలింగ్‌ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్‌ వద్ద | CM Revanth Reddy At Bandaru Dattatreya Autobiography book launch | Sakshi
Sakshi News home page

స్కూలింగ్‌ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్‌ వద్ద

Jun 9 2025 5:22 AM | Updated on Jun 9 2025 5:22 AM

CM Revanth Reddy At Bandaru Dattatreya Autobiography book launch

సిక్కిం మాజీ గవర్నర్‌ దివంగత రామారావు సతీమణి వసంతకుమారికి పుస్తకం అందజేస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌

బీజేపీలో చాలామందితో నాకు మంచి సంబంధాలు 

ప్రజలతో మమేకమయ్యేవాళ్లే రాజకీయాల్లో రాణిస్తారు 

దత్తాత్రేయ ‘ఆత్మకథ’పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి 

పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ 

హాజరైన వెంకయ్య, చంద్రబాబు, పలువురు గవర్నర్లు 

సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే వారికే నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారంతా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్‌ బీజేపీలో, కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద చేసి, ఉద్యోగం రాహుల్‌గాంధీ వద్ద చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. 

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌ హరిబాబు, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ. ‘ఇటీవల నీతి అయోగ్‌ సమావేశం అనంతరం భోజన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నీ సహచరుడు అక్కడున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపించారు. అందుకు నేను స్పందిస్తూ.. నా స్కూలింగ్‌ అంతా మీ వద్ద (బీజేపీ) జరిగింది. కాలేజీ స్టడీ ఆయన (చంద్రబాబు) దగ్గర, ఇప్పుడు ఉద్యోగం రాహుల్‌గాంధీ వద్ద చేస్తున్నా అని బదులిచ్చాను. నాకు చాలామంది బీజేపీ నేతలతో స్నేహముందని వివరించాను’అని వెల్లడించారు.
  
దత్తాత్రేయ ప్రజల మనిషి 
హోదాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్‌ కొనియాడారు. ‘దత్తాత్రేయ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రజల మనిషి. అందుకే అన్నిపార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. గౌలిగూడ నుంచి గవర్నర్‌ వరకు ఎన్నో పదవుల్లో కొనసాగిన దత్తాత్రేయ నిత్యం ప్రజలు, కార్యకర్తలతోనే ఉంటారు. 

హైదరాబాద్‌లో మాస్‌ నేతలు ఇద్దరే. ఒకరు పీ.జనార్ధన్‌రెడ్డి, మరొకరు బండారు దత్తాత్రేయ. నగర ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వీరిలో ఒకరికి చెప్పుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలి’అని సూచించారు. 

కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: రామ్‌నాథ్‌ కోవింద్‌ 
ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన తాను తెలుగు రాష్ట్రాలను రెండో ఇళ్లుగా పరిగణిస్తానని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. బండారు దత్తాత్రేయతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మీక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మీకుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశవ్యాప్తంగా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ సేవలు మెరుగపర్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 

‘దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దత్తాత్రేయ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, ఆయనను హరియాణా గవర్నర్‌గా నియమించారు. అక్కడ జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని ఆయననే అడిగాను. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని దత్తాత్రేయ చెప్పారు’అని కోవింద్‌ వివరించారు.  

లేఖలకు బ్రాండ్‌ అంబాసిడర్‌: చంద్రబాబు 
హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. నిబద్ధత, అంకితభావం, జాతీయత, సేవ, సమగ్రత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాయ్‌ బలాయ్‌ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలు అంశాలపై దత్తాత్రేయ పెద్ద సంఖ్యలో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చమత్కరించారు.  

దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం లేదు: వెంకయ్యనాయుడు 
బండారు దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదని, ప్రజలే ఆయన జీవితమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రస్తుత నాయకులు డైపర్స్‌ మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారుతుండటంతో రాజకీయాలు చులకన అయ్యాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. 

సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ 
రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదని బండారు దత్తాత్రేయ అన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు సమాజంతో మమేకం అవ్వాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడితే పదవులు అవే వస్తాయని తెలిపారు. 

ప్రజలు, కార్యకర్తలే తన కుటుంబమని, వాళ్లే తన ఆస్తి అని చెప్పారు. అలాయ్‌బలాయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యకక్రమంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement