
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మా ప్రభుత్వాన్ని పడగొడతామని కామెంట్స్ చేసిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారని సెటైరికల్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ తొలిసారిగా స్పందించారు.
కాగా, సీఎం రేవంత్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. మూడు నెలలు కూడా ఈ ప్రభుత్వం ఉండదన్నారు. మా పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడు కనిపించకుండా పోయారు. వారంతా ఎక్కడున్నారు. వాళ్ల పార్టీలో ఎవరు ఉన్నారు.. ఎవరు లేరో అని లెక్కలు చూసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. ఒక్క అంగీ, లాగు తప్ప. మా ప్రభుత్వ ఆలోచనా విధానం, అభివృద్ధి చూసే వారంతా కాంగ్రెస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతుంటే.. మరోవైపు ప్రభుత్వాన్ని మేం నిలబెడతామని ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని అన్నారు.
ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలనే ఓఆర్ఆర్, ఐటీ, ఫార్మా, అంతర్జాతీయ విమనాశ్రయాలను తీసుకువచ్చిందన్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలోని గంజాయిని తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వాళ్లు.. ఆరు నెలల్లో మేము ఏదీ చేయలేదని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతీ నెలా రూ.ఏడు వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.