మసి‘బీసీ’ నవ్వులపాలు దిక్కుమాలినబీసీ డిక్లరేషన్‌ | Chandrababu Naidu Copied Jagans Government Slogan In Jayaho BC Sabha, Details Inside - Sakshi
Sakshi News home page

మసి‘బీసీ’ నవ్వులపాలు దిక్కుమాలినబీసీ డిక్లరేషన్‌

Published Thu, Mar 7 2024 5:01 AM

Chandrababu copied Jagans government slogan - Sakshi

వచ్చే ఐదేళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు రూ.1.50 లక్షల కోట్లు 

గత ఐదేళ్లలో జగన్‌ బీసీలకు చేకూర్చిన లబ్ధి రూ.1.76 లక్షల కోట్లు 

బీసీలంటే ‘బ్యాక్‌ బోన్‌’ అన్న వైఎస్సార్‌సీపీ స్లోగన్‌నే కాపీ కొట్టిన టీడీపీ 

బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ జగన్‌ సర్కారు అమలు చేస్తున్నవే 

బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. ఇలా అన్నీ కాపీనే 

అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు 

నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 34 శాతం ఇస్తామన్న బాబు 

50 శాతానికిపైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ 

అభాసుపాలైన బాబు, పవన్‌ బీసీ డిక్లరేషన్‌ 

బీసీ డిక్లరేషన్‌ సభలో తాను అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు చేస్తానన్న  ఖర్చు రూ. 1.50 లక్షల కోట్లు..  గత ఐదేళ్లలో బీసీల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  చేసిన ఖర్చు రూ. 1.76 లక్షల కోట్లు   బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా చూసిన చంద్రబాబు  ‘బ్యాక్‌ బోన్‌’ అంటూ జగన్‌ ప్రభుత్వ స్లోగన్‌ను కాపీ కొట్టారు.  

బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు.. ‘బ్యాక్‌ బోన్‌’ అంటూ గత ఐదేళ్లలో వారికి అన్ని రంగాల్లో జగన్‌ అగ్రప్రాధాన్యం ఇచ్చారు.  ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ అయినా.. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేస్తామని హామీలిస్తుంది. కానీ నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడంలోసిద్ధహస్తుడైన చంద్రబాబు మాత్రం బీసీలకు అంతకంటే తక్కువ ఖర్చు చేస్తానని చెప్పి నవ్వుల పాలయ్యారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కాపీ కొట్టి డిక్లరేషన్‌ అంటూ విడుదల చేయడం ఆ పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది.  చంద్రబాబు కాపీల్లో మచ్చుకు కొన్ని బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. పెన్షన్‌లు 
–సాక్షి, అమరావతి  

మళ్లీ మోసం చేసేందుకు బాబు రెడీ 
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇంతవరకు 1.78 లక్షల కోట్లను బీసీలకు ఇచ్చారు. అందులో డీబీటీ(డైరక్ట్‌ టు బెనిఫి షియర్‌) ద్వారా నేరుగా బీసీల బ్యాంక్‌ అకౌంట్లలోకి 1,27,730 కోట్లను వివిధ పథకాల ద్వారా జమ చేశారు. మరో రూ.50,657 కోట్లు నాన్‌–డీబీటీ కింద ఆ వర్గాలకు అందించారు. మొత్తం కలిపి రూ.1,78,387 కోట్లను బీసీలకు ఇచ్చారు. అయితే బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు మంగళవారం జరిగిన సభలో గొప్పగా చెప్పారు.

అంటే వైఎస్‌ జగన్‌ ఇచ్చిన దాని కంటే తగ్గించి చేస్తామని బీసీ డిక్లరేషన్‌ ద్వారా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి హామీ ఇవ్వడం విశేషం. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అమలు చేస్తున్నారు. నిజానికి ఇదే డిక్లరేషన్‌ను గతంలోనూ ప్రకటించిన చంద్రబాబు అమలు చేయకుండా బీసీలను మోసం చేశారు. మళ్లీ వారిని మోసం చేసేందుకు కొత్త బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. 

ఇంటికే కుల ధ్రువీకరణ పత్రాలు కనిపించలేదా? 
శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని గొప్పగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు శాశ్వతమైనవే. వైఎస్‌ జగన్‌ దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడంతో రెవెన్యూ శాఖ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది.

అది తెలిసి కూడా బీసీలకు చేయడానికి ఏం హామీలు లేవన్నట్లు కాపీ కొట్టారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు హామీ ఇస్తూనూ ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ హామీలో బీసీలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. గత ఐదేళ్లుగా వలంటీర్లతో ఇంటికే పెన్షన్‌ అందిస్తుండగా.. చంద్రబాబు మాత్రం ఇప్పుడు కొత్త బిచ్చగాడిలా వలంటీర్లతో ఇంటికే పెన్షన్‌ అందిస్తామని చెప్పడం కొసమెరుపు.

2012 బీసీ డిక్లరేషన్‌ ఏమైంది బాబూ! 
బీసీ డిక్లరేషన్‌ పేరుతో గతంలో వందకు పైగా ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు.  
2012లో 19 ప్రధాన హామీలతోపాటు చేతి వృత్తులు, కులాల వారీగా మొత్తం 119 హామీలిస్తూ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేదు. డిక్లరేషన్‌ అమలు పేరుతో ఏకంగా 56 కమిటీలు వేసి కాలయాపన చేశారు. కత్తెరలు, ఇస్త్రీ పెట్లెలు ఇచ్చి అదే ఆదరణ అంటూ డబ్బాలు కొట్టుకున్నారు. చివరికి దాన్ని ఒక కుంభకోణంగా మార్చారు. ఇప్పుడు ఆ కుంభకోణాన్ని మళ్లీ తీసుకువస్తానని ప్రకటించడం విశేషం. 
 బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇస్తానని డిక్లరేషన్‌లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లు కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టాడు. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో కేవలం 18 సీట్లు బీసీలకు కేటాయించి వంచన చేశాడు.  
రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తానన్న చంద్రబాబు ఆ హామీ గాలికి వదిలేశారు. ఐదేళ్లలో రూ.50 కోట్లు సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సి ఉండగా అందులో సగం నిధులు కూడా కేటాయించలేదు.   

చివరికీ స్లోగన్‌ కూడా కాపీనే.. 
టీడీపీ బీసీ డిక్లరేషన్‌ రూపకల్పన మొక్కుబడి తంతు అని చంద్రబాబు నిరూపించుకున్నారు. ఈ డిక్లరేషన్‌ కోసం కనీసం ఒక స్లోగన్‌ను కూడా చంద్రబాబు, టీడీపీ ఇవ్వలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల క్రితం ఇచ్చిన ‘బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌’ అనే స్లోగన్‌ను కాపీ కొట్టి తమ డిక్లరేషన్‌లో పెట్టుకోవడం బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్న నిర్లిప్తత, భావ దార్రిద్యాన్ని తేటతెల్లం చేసింది. బీసీల పార్టీ అని డబ్బా కొట్టుకుంటూ కనీసం వారి ఒక కొత్త స్లోగన్‌ కూడా చెప్పలేని స్థితిలో చంద్రబాబు, ఆయన పరివారం ఉంది.  

కొత్తగా మళ్లీ కార్పొరేషన్లా? 
జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికే 139 కులాలకు 56 కార్పొరేషన్లను వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారు. మళ్లీ తాను వస్తే ఏర్పాటు చేస్తానని డిక్లరేషన్‌లో చెప్పడం మోసగించడమేనని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తామని ఎందుకు చెబుతున్నారు? ఇది మోసం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.  

2014లో కులగణన ఎందుకు చేయలేదు? 
చట్టబద్ధంగా కుల గణన చేస్తామని చంద్రబాబు డిక్లరేషన్‌లో డబ్బా కొట్టుకున్నారు. గతంలో ఇచ్చిన ఆ హామీ ఏమైంది. అధికారంలోకి వచ్చాక దాన్ని బుట్టదాఖలు చేశారు. వైఎస్‌ జగన్‌ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికే కుల గణన ప్రారంభించారు. 

అన్నీ జగన్‌ అమలు చేస్తున్న పథకాలే.. బాబు కాపీ 
నేతన్నలను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24 వేలు సాయంతోపాటు పెన్షన్‌ వయో పరిమితి కుదించి అర్హులందరికీ రూ.3 వేలు పెన్షన్‌ ఇస్తున్నారు. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో ప్రైవేట్‌ బిల్లు పెట్టించి సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. 

వంచనలో వస్తాద్‌ 
 చేనేత రంగానికి 25 హామీలు గుప్పించి ఒక్కటీ నెరవేర్చలేదు. రుణాలు మాఫీ చేస్తానని.. కమిటీతో చేతులు దులిపేసుకున్నారు. చేనేత కారి్మకులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్‌లో ఏటా రూ.వెయ్యి కోట్ల మాటే మరిచారు.  
 ప్రమాదవశాత్తు మరణించిన వృత్తి పనివారికి పరిహారం.. చేతి, కుల వృత్తుల సమాఖ్యలను బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో అనుసంధానం చేసి ఆదుకుంటామమన్న హామీ గాల్లో కలిపేశారు.   
గీత కార్మికులకు ఏడు హామీలిచ్చి మోసం చేశారు. బెల్టుషాపులు తొలగించి గీత వృత్తిని ఆదుకుంటామని, హైబ్రిడ్‌ విత్తనాలు సరఫరా చేసి గీత చెట్లను పెంచేలలా ప్రోత్సహిస్తామని, తాటితోపుల పెంపకానికి భూమిని కేటాయిస్తామని ఇచ్చిన హామీని, అన్ని కులాలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. 

Advertisement
Advertisement