
సాక్షి,తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు అల్లిన కథ తప్ప మరొక్కటి కాదని టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసారు. వాస్తవానికి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతోందని ఆయన తేల్చి చెప్పారు.
తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన 3760 లిక్కర్ షాపుల్లో అధిక శాతం కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులకే చెందేలా కథ నడిపించారని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో అక్రమాల మీద కేసు నమోదైన నేపధ్యంలో.. కేవలం కక్ష సాధింపుతోనే లేని స్కామ్లో వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టులు చేస్తున్నారని భూమన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..లిక్కర్ స్కాం పేరుతో జరుగుతున్న అరెస్టులు కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం మాఫియా యధేచ్చగా దోపిడీ చేస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యాన్ని దశలవారీగా నిషేధించుకుంటూ వెళ్లాలన్న సామాజిక స్పృహతో పరిపాలన చేస్తే... చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి వస్తే తక్కువ ధరకే మందు ఇస్తానని ఎన్నికలకు మందు ప్రచారం చేశాడు.
నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చంద్రబాబు తీసుకొచ్చిన మద్యం పాలసీ కారణంగా రాష్ట్రంలో ఇవాళ 3760 బ్రాందీ షాపులును ఆయన తన పార్టీకి, జనసేనపార్టీకి చెందిన ప్రయివేటు వ్యక్తులకే దాదాపు 95 శాతానికి వచ్చేటట్టుగా చేశారు. ఇతరులు ఎవరైనా ఆ షాపులకు పోటీపడితే వాళ్లను బెదిరించి, టెండర్లలో పాల్గొనకుండా చేసి.. తమ పార్టీ వాళ్లకే వచ్చేటట్టు చేయడమే కాకుండా ప్రతినెలా ఒక్కో షాపు నుంచి రూ.1లక్ష వసూలు చేస్తున్నారు. అంటే దాదాపు రూ.370 కోట్లు ప్రభుత్వ ముఖ్యులకు ఈ డబ్బులు ముడుతున్నాయి.
ఇంతకంటే పెద్ద స్కామ్ మరొక్కటి లేదు. దానికి పరిహారంగా రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటి గంటకు వెళ్లినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంచేటట్టుగా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం నిబంధన మాత్రం ఉదయం 10 గంటల తర్వాతే బ్రాందీ షాపు తెరవాలని ఉన్నా... 24 గంటలు షాపులు అందుబాటులో ఉంటున్నాయి. అలా అనుమతి ఇచ్చినందుకే ప్రతి షాపు నుంచి నెలకు రూ.1లక్ష కమిషన్ బిగ్ బాస్ లకు ముట్టుతుంది. రాష్ట్రమంతటా ఇదే పద్దతి కొనసాగుతుంది. టెండర్లు వేసిన తర్వాత నిన్న మొన్నటి వరకు బ్రాందీ షాపు యజమానులకు 9 శాతం కమిషన్ ఇవ్వగా.. ఈ మధ్యనే దాన్ని 14.5 శాతం కమిషన్ పెంచారు. 24 గంటల షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు కమిషన్ కూడా పెంచారు. ఇలా కమిషన్ 5.5 శాతం పెంచడం వల్ల వీరి ఆదాయం రూ.1680 కోట్ల ఆదాయం పెరుగుతుంది. తద్వారా దాదాపు మరో రూ.800 కోట్లు బిగ్ బాస్ జేబులోకి వెళ్తున్నాయని మద్యం షాపులు యజమానులే చెబుతున్నారు.
దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్
వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3760 బ్రాందీ షాపుల వెనుక ఒక మినీబార్ను ప్రారంభించారు. ఈ బార్లలో 24 గంటలు పాటు అమ్మకాలకు తెరతీసి... తాగే ఏర్పాటుచేస్తున్నారు. ఇదే విషయాన్ని తిరుపతిలో టైమింగ్స్ తో సహా నిరూపించాం. తిరుపతిని రోల్ మోడల్ గా చూపించి.. రాష్ట్రవ్యాప్తంగా చూపించారు. ఇదే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరోవైపు ప్రతి బాటిల్ పైన రూ.10 నుంచి రూ.20 అదనంగా ఇప్పుడు అమ్మడం ప్రారంభించారు. దీని ద్వారా మరలా కొన్ని వందల కోట్ల రూపాయలు టీడీపీ అధినేతకు, మద్యం షాపుల యజమానులకు అందుతుంది. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా మరలా 60 వేల మద్యం బెల్టు షాపులను తెరిచారు.
ఈ బెల్టుషాపుల యజమానుల నుంచి కూడా నెలకు రూ.50 నుంచి రూ.60 వేలు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. దీనిద్వారా కూడా వందలాది కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నాయి. ఇక ఈ బెల్టుషాపులు యజమానులైతే రూ.30 నుంచి రూ.40 ఎక్కువ ధరకు మద్యం బాటిల్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవం. కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలన్నీ వైఎస్ జగన్ హయాంలో మద్యం విక్రయాల్లో దారుణం జరిగిందని అబద్దాలు చెబుతున్నారే తప్ప.. చంద్రబాబు హయాంలో జరుగుతున్నఅతి పెద్ద మద్యం స్కామ్ దారుణం గురించి ఏ ఒక్కరూ మాట్లాడ్డం లేదు. వైఎస్సార్ హాయంలో కొత్త డిస్టలరీలు ఏర్పాటు చేసి నాసిరకం మద్యం అమ్మకాలు చేశామని..చంద్రబాబు ఆయన్ను మోసే పత్రికలు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ వాస్తవానికి చంద్రబాబు హయాంలో గతంలో ఆయన అనుమతులు ఇచ్చిన 14 డిస్టలరీలే జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా చేశాయి. ఒక్క డిస్టలరీకి జగన్ హయాంలో అనుమతి ఇవ్వలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలోనూ కనీసం 2-3 బెల్టుషాపులను చంద్రబాబు ప్రభుత్వం తెరిచింది.
వైద్యనిపుణులు చెప్పిన మాట ప్రకారం ఏ రకమైన మద్యపానం అయినా ఆరోగ్యానికి హానికరమని చెపుతున్నారు. చంద్రబాబు మాత్రం నేను నాణ్యమైన మందు ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.కానీ వాస్తవంగా ఇవాళ ఆయన పాలనలో రూ.99లకు అత్యంత నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారు. తద్వారా విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. చంద్రబాబునాయుడు నాణ్యమైన మద్యం అందిస్తానని చెబితే.. జగన్ మాత్రం మద్యపానం సామాజిక దురాచారం కాబట్టి దాన్ని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని తాపత్రయపడ్డారు. అందుకే చంద్రబాబు హయాంలో ఉన్న 4800 పైగా ఉన్నమద్యం షాపులను 2,900 కే కుదించడంతో పాటు మద్యం ధరలు పెంచి ప్రజలను మద్యపానం నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. పెంచిన ధరల ద్వారా ఖజానా ఆదాయం పెరిగింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం- పారదర్శక లిక్కర్ పాలసీ.
చంద్రబాబు హయాంలో ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విస్కీ, బ్రాందీ బాటిల్స్ గత ప్రభుత్వ హయాం కంటే 25 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. బీరు బాటిల్స్ 16 లక్షల కేసులు అత్యధికంగా అమ్ముడైనా.. ప్రభుత్వ ఆదాయం పడిపోగా.. చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన ప్రయివేటు మద్యం షాపుల యజమానుల ఆదాయం కొన్ని వందల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయాలు వీరి జేబుల్లోకి పోతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ఓట్లు వేయకపోయినా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పిన థీశాలిగా నిలబడ్డారు.
చంద్రబాబు హాయంలో వారు చెప్పిన కొన్ని బ్రాండ్లకు అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చే సంస్కృతి ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవ్వరికీ అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వలేదు. వాస్తవానికి చంద్రబాబుకి కావాల్సిన 5 మంది డిస్టలరీ యజమానులు 2014-19 మధ్యలో ఏకంగా 69శాతం మద్యం విక్రయించారు. తిరిగి జగన్ హయాంలో వాళ్లకి అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వకపోవడం, మద్యం ధరలు పెంచడంతో ఆ 5 డిస్టలరీల యాజమాన్యం ఇండెంట్ వేయడం ఆపేశారు. చంద్రబాబు హయాంలో ఉన్న 14 డిస్టలరీలే తిరిగి జగన్ హయాంలోనూ మద్యం అమ్మకాలు చేశారే తప్ప కొత్తవాటికి జగన్ అనుమతి ఇవ్వలేదన్నది పచ్చి నిజం. ఈ విషయాన్ని మరుగున పెట్టి... వైస్ జగన్ హయాంలో దోపిడి జరిగినట్టుగా ప్రచారం చేశారు.
వాస్తవానికి జగన్ హాయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బ్యాటిల్ మద్యాన్ని వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలకు మందు సరఫరా అయ్యింది తప్పే.. చంద్రబాబు హాయంలో కాదు. జగన్ ప్రభుత్వంలో డిస్టలరీల నుంచి నేరుగా 30శాతం మద్యం ప్రభుత్వ సీళ్లు లేకుండా ప్రభుత్వ షాపుల్లోకి వెళ్లిందని మందు చంద్రబాబు ఆయన్ను మోసే ప్రచార మాధ్యమాల ముఠా అతిపెద్ద ప్రచారం చేసింది. ఐదేళ్ల పాటు మా ప్రభుత్వంపై అంత దాడి చేసిన ఈ ప్రచార మాధ్యమాలు... ఒక్క బాటిల్ అయినా ప్రభుత్వ సీలు లేకుండా బయటకు వస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారు.
అదే ఇప్పుడు మీ ప్రభుత్వంలో 24 గంటలు మద్యం షాపులు తెరుస్తున్నారు... ప్రతి మద్యం షాపు వెనుక బార్ ఉందని... మీ షాపుల్లో ఇంత ఎక్కువ ధరకు అమ్ముతున్నారని మేం స్వయంగా వెళ్లి పరిశీలించి రాష్ట్రానికంతటికీ తెలియజెప్పాం. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే ఆ రోజు ఎందుకు మీరు నిరూపించలేకపోయారు. కారణం మీరు చెప్పింది పచ్చి అబద్దం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్, వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదన్నది పచ్చి నిజం. కానీ మేం ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో మీరు జగన్ మీద విషప్రచారం చేశారు.
అడుగడుగునా ఎల్లో మీడియా విషప్రచారం.
వైఎస్ జగన్ రైతుల కోసం వస్తే ఏకంగా దండుపాళ్యం బ్యాచ్ దాడిచేసిందన్నారు. ఇవాళ అదే ఎల్లో మీడియా మహిళల మీద ఇష్టం వచ్చినట్లు రాశారు. జగన్ మందు తాగి అది కూడా ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం పురుషులు 8810 అయితే మహిళలు 3833 మందికి నరాలు దెబ్బతిన్నాయి అని రాశారు. అంటే మహిళలు తాగుబోతులని చెప్పడం కాదా మీ అవసరాల కోసం, జగన్ మోహన్ రెడ్డిని హననం చేయడం కోసం మహిళల నరాలు పాడయ్యాయని రాశారు. 2,500 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టే.. చంద్రబాబు హయాంలో జరిగిన దారుణాలకు, ఘోరాలకు అనారోగ్యం పాలైన వాళ్లే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ పొంది తమ అనారోగ్యాన్ని నయం చేసుకున్నారన్నది ముమ్మూటికీ నిజం.
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా ఒక్క తాగుబోతు రోడ్లమీద కనబడలేదు... మీ పత్రికల్లో కూడా రాయలేదు. కానీ ఇవాళ నడిరోడ్లలో రాష్ట్రమంతా తాగుబోతులు విపరీతంగా దౌర్జన్యాలు, అల్లర్లు చేస్తూ చివరికి తిరుమలలోనే వేంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరే ఎంత మందు కావాలి అని తాగుబోతు సవాల్ చేస్తే.. మరో నలుగురు తాగుబోతులు అక్కడే నృత్యం కూడా చేశారు. అంటే చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఎంత పచ్చిగా తాగుడు ఉద్యమాన్ని పెంచి పోషిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
మద్యం కేసులో మీడియా ట్రయిల్స్..
మద్యం పాలసీ దర్యాప్తు వ్యవహారంలో ఈ అవినీతి పత్రికలు వంటే ఎక్కువగా ఉంది. దాన్నే మరుసటి రోజు సిట్ అందుకుని కథ నడిపిస్తోంది. ఒక్క రూపాయి అవినీతి జరగకపోయినా.. ఒక్క రూపాయి పట్టుబడకపోయినా.. పట్టుబడి రూ.63 కోట్లు సొమ్ము మద్యం కుంభకోణానికి సంబంధించింది కాకపోయినా .. దాన్ని మద్యం కుంభకోణానికి సిట్ జోడించ తప్పుడు కేసులు బనాయించింది. గతంలో చంద్రబాబు హాయంలో మద్యం కుంభకోణంలో ఆయన మీద కేసులు నమోదైతే.. గౌరవ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తో బాబు బయటపడ్డాడు. దీంతో తన మీద కేసులు పెట్టారన్న కక్షతో ఇవాళ వైఎస్సార్ సీపీ నేతలు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎక్సైజ్ సీల్ లేకుండా మా హయాంలో ఒక్క బ్యాటిల్ కూడా పట్టుబడలేదు.
మా నాయకుడు వైఎస్ జగన్ ఎల్లప్పుడూ మనిషికి అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయం,మహిళా సాధికారత వంటి మహోన్నతంశాలే ప్రాధాన్యంగా పనిచేస్తే... చంద్రబాబుకి విస్కీ, బ్రాందీ అమృత తుల్యమైనవి. ప్రజలతో ఎంత మందు తాగిస్తే.. చంద్రబాబు ఆదాయం అంతలా పెరుగుతుంది కాబట్టే దేశంలోనే లేని విధంగా మద్యం కుంభకోణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది.
జగన్ హాయంలో అప్పటి మద్యం పాలసీ వల్ల ప్రభుత్వానికి ఒక్క నయాపైసా కూడా ఆదాయం తగ్గలేదు. అదే చంద్రబాబు ఇంతపెత్త ఎత్తున మద్యం అమ్మకాలు చేస్తున్నా.. ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చడానికి ఉద్యమ రూపంలో పోరాటం చేస్తున్నా మద్యం అమ్మకాలు పెరిగాయే తప్ప.. ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గుతున్నాయి కారణమేమిటంటే.. చంద్రబాబు ఆయన పార్టీ పెద్దలు, టీడీపీకి చెందిన మద్యం షాపులు యజమానుల జేబుల్లోకి రూ.1000 కోట్ల పైగా ఆదాయం పోతుంది.
మా హయాంలో మద్యం పాలసీ వల్ల రూ.50 వేల కోట్ల స్కాం అని, దాన్ని రూ.30 వేల కోట్లకు మార్చి.. చివరకు రూ.5 వేల కోట్లు అని చెపితే అది కాస్తా ఇప్పుడు రూ.2,500 కోట్లకు జారింది. అదే చంద్రబాబు హాయంలో వేలాది కోట్ల రూపాయాలు స్కామ్ జరుగుతున్నా దాని గురించి మాత్రం ఆయన్ను మోసే ప్రచార మాధ్యమాలు ఎక్కడా మాట్లాడవు. ఎదుట వారి మీద ఆరోపణలు చేయడం కాదు.. మీ వాళ్లు చేస్తున్న తప్పులను ఎండగడితేనే పత్రికావిలువలు. కానీ మీరు ఇష్టమొచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి పాలన మీద చేస్తున్న దాడి, మీ రాతల ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారం ప్రజలకు అర్ధం అయింది.
మీరే ముందు ఫలానా స్కామ్ అని రాస్తారు. కొద్ది రోజుల తర్వాత ఫలానా వ్యక్తి మాస్టర్ మైండ్ అని రాస్తారు. ఆ తర్వాత మరో ఇద్దరు కలిసారు అని రాస్తారు. దానిపై కేసు నమోదు చేస్తారు. అందులో భాగంగానే మిధున్ రెడ్డి లాంటి సౌమ్యడును, తమ జీవిత కాలమంతా నిజాయితీ పరులై అధికారులుగా పేరు తెచ్చుకున్న కృష్ణమోహనరెడ్డి, ధనంజయ్ రెడ్డి లాంటి అధికారులను, జీవితకాలంలో లిక్కర్ వాసన చూడని చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వాళ్లను అరెస్టు చేస్తారు. ఇదంతా రాజకీయ పూరితమైన కుట్ర. ఇది రాజకీయ ట్రయిల్ తప్ప మరొక్కటి కానే కాదు.
బాబు లిక్కర్ స్కామ్పై మరింత ఉద్యమం...
చంద్రబాబునాయుడు ఇవాళ మద్యం పాలసీ ద్వారా చేస్తున్న దోపిడీ మీద వైఎస్సార్సీపీ మరింత ఉద్యమిస్తుంది. మీ పాలనలో జరుగుతున్నవంచనను ప్రజలకు తెలియజేస్తాం. మిమ్నలని మోసే పత్రికలు.. మద్యం ప్రియలకు వెసులుబాటు,ఊరట అని రాసే రాతలు వార్తలు ప్రపంచానికి అవసరం లేదు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు.. సూపర్ సిక్స్ సహా కూటమి పార్టీలు ఇచ్చిన 143 హామీల అమలు ఇవీ ప్రజలకు అవసరమైనవి. ఇవాళ మంత్రి అచ్చన్నాయుడు ఓ సభలో మాట్లాడుతూ... సూపర్ సిక్స్ హామీలో ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలన్నాడు. మరి ఆ రోజు మీ పార్టీ ఎందుకు ఈ హామీ ఇచ్చింది. కేవలం ఓట్లు దండుకోవడానికి అబద్దాలు చెప్పి... ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నాడు.
మామిడి కొనుగోళ్లు- చేతకాని పాలన
జూలై 21న కేంద్ర ప్రభుత్వ వ్యవసాయమంత్రిత్వ డిప్యూటీ కమిషనర్ రాష్ట్ర వ్యవశాయశాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీకి లేఖ రాస్తూ... 1.62 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కిలోకు రూ.3.85 కు మద్ధతు ధర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తుందని చెప్పారు. తోతాపురి కాగడా పెట్టి వెదకని రోజులలో ఈ లేఖ రాశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం వస్తున్నాడంటే.. తోతాపురి మామిడి ఎక్కడుంది, అంతా కొనుగోలు చేశారని ఊదరగొట్టి రాసిన తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఛానెళ్లు ఇప్పుడు ఏం చెబుతాయి. ఈ స్ధాయిలో కొనుగోళు చేయాలంటే వచ్చే ఏడాది కావాలే తప్ప.. ఈ ఏడాది లేవు. ఇప్పుడు మద్ధతు ధర ప్రకటించి ఏం ప్రయోజనం. గతంలో కేజీకి రూ.4 ఇస్తానన్న చంద్రబాబు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం కలిసి రూ.3.85 కు చెరిసగం భరిస్తూ కొనుగోలు చేస్తామని రాశారు.
పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామికి సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి లేఖ రాస్తే... పదవీ విరమణ చేసిన ఎక్స్ అఫిషియో సెక్రటరీకి కేంద్ర వ్యవసాయశాఖ డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఏ స్థాయి గౌరవం ఉందో ఈ లేఖను బట్టి తెలుస్తోందని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన్ను రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం బలంగా ప్రతిఘటిస్తుంది కాబట్టి వారిని కావాలనే ఇరికించారని చెప్పారు. ఈ లిక్కర్ స్కామ్ కేవలం చంద్రబాబు ప్రభుత్వం అల్లిన ప్యాబ్రికేటెడ్ స్కామ్ అని ఇప్పడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్నదే అసలైన అతిపెద్ద మద్యం స్కామ్ అని భూమన స్పష్టం చేశారు.