
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.
‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.
‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది
..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.