ఒక్కొక్కరిది ఒక్కో సమస్య | - | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

Jun 17 2025 7:03 AM | Updated on Jun 17 2025 7:03 AM

ఒక్కొ

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

● పరిష్కరించాలని వేడుకోలు ● ప్రజావాణికి అభాగ్యుల బారులు
బెస్ట్‌ అవైలెబుల్‌ పెండింగ్‌ నిధులు విడుదల చేయాలి

సాక్షి, పెద్దపల్లి: ‘సారూ.. మా సమస్యలు పరిష్కరించండి’ అని పలువురు అభాగ్యులు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ వేణును వేడుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అధికారులు సమస్యలను పరిష్కరించామని కాగితాల్లో చూపుతున్నారని, ఆచరణలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని పలువురు బాధితులు వాపోయారు. ప్రజావాణికి ఎక్కువగా భూ సమస్యలు, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇంది రమ్మ ఇళ్లకు సంబంధించిన అర్జీలు వస్తున్నాయి. పలువురు అర్జీదారులను ‘సాక్షి’ పలుకరించగా తమ ఆవేదనను ఇలా వెల్లడించారు..

● సుల్తానాబాద్‌ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన పాలకుర్తి లక్ష్మి తన కుటుంబానికి చెందిన సర్వే నంబర్‌ 645లో గల భూమిని తనకు, తన కుమారుడికి తెలియకుండానే తన రెండో కోడలు పాలకుర్తి రజిత.. తన పేరిట పహాణిలో పట్టాదారుగా పేరు నమోదు చేసుకుందని వాపోయింది. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకొని తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ ప్రజావాణిలో అర్జీ సమర్పిచింది.

● జిల్లాలో ఏర్పాటు చేసిన కబేళాల్లో ఎన్నింటికి అధికారుల నుంచి అనుమతి ఉందనే సమాచారం తెలియజేయాలని సుల్తానాబాద్‌ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సెట్టు సురేశ్‌ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

● తను బోదకాలుతో బాధపడుతున్నానని, దివ్యాంగురాలి పింఛన్‌ మంజూరు చేయాలని పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన బోంగు రాజమ్మ అదనపు కలెక్టర్‌కు అర్జీ అందజేసింది.

ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి

పెద్దపల్లిలోని తిలక్‌ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నా. నాకు ఇద్దరు పిల్లలు. అందులో పాప దివ్యాంగురాలు. విచారణ జరిపిన అధికారులు.. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నా పేరు రాసుకుని పోయారు. కానీ, తుదిజాబితాలో నా పేరు రాలేదు. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.

–రేగుంట సునీత, తిలక్‌నగర్‌

సర్వే చేయడం లేదు

నాకు ఎకరన్నర భూమి ఉంది. దానికి సంబంధించి సర్వే చేసేందుకు 2021లో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు సర్వే చేయడం లేదు. ఈవిషయం గురించి అధికారులను అడిగితే రేపు, మాపు అంటున్నారు తప్పితే సర్వేకు ఎవరూ రావడం లేదు. ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రజావాణికి వచ్చా. – పంజాల సురేశ్‌, నందిమేడారాం

కాలేజీని తరలించొద్దు

మంథని గురుకుల ఇంటర్మీడియట్‌ కళాశాలను పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని మళ్లీ మంథనికి తరలించడంతో స్థానిక విద్యార్థినులకు అసౌకర్యం కలుగుతుంది. కళాశాలను పెద్దపల్లిలోనే కొనసాగించాలి.

– ముస్లిం జేఏసీ నేతలు

గోదావరిఖనిటౌన్‌: బెస్ట్‌ అవైలెబుల్‌ స్కూల్‌ బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బరిగెల ప్రసన్నకుమార్‌ కోరారు. ఈమేరకు ప్రజావాణి ద్వారా అదనపు కలెక్టర్‌ వేణుకు వినతిపత్రం అందజేశారు. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ద్వారా బెస్ట్‌ అవైలెబుల్‌ ప్రవేశాలు పొందిన వారికి మూడేళ్లుగా అవసరమైన నిధులు విడుదల చేయడం లేదన్నారు. దీంతో నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారని, దీనిద్వారా పేద, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. తక్షణమే స్పందించి పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని ఆయన కోరారు.

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య1
1/4

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య2
2/4

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య3
3/4

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య4
4/4

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement