సాదాబైనామాలే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

సాదాబైనామాలే ఎక్కువ

Jun 17 2025 7:03 AM | Updated on Jun 17 2025 7:03 AM

సాదాబైనామాలే ఎక్కువ

సాదాబైనామాలే ఎక్కువ

● పైలెట్‌ ప్రాజెక్టులోనూ ఇవే దరఖాస్తులు ● సివిల్‌ తగాదాల విషయంలోనూ ఇదే తీరు ● సర్వే నంబర్ల మిస్సింగ్‌పైనా భారీగా అప్లికేషన్లు ● పీవోటీ కేసులు సిరిసిల్లలో అధికం ● సాదాబైనామాల్లో జగిత్యాల టాప్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

భూ భారతి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికై న ప్రతి మండలంలోనూ సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువగా వచ్చాయి. తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల రెగ్యులరైజేషన్‌ కోసం గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో 2016, 2020లో రెండు దఫాలుగా సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్‌2 లోపు సాదాబైనామాలకే వర్తిస్తుందనే షరతు విధించారు. తొలుత 2016లో 11.19 లక్షల అప్లికేషన్లు వస్తే 6.15 లక్షల అప్లికేషన్లను పరిష్కరించి, సరైన ఆధారాలు లేవని 3లక్షల అప్లికేషన్లను తిరస్కరించారు. మరో 2.04 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు మరో సారి సాదాబైనామా అప్లికేషన్లను స్వీకరించారు. ఆ సమయంలో మరో 7.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పాతవాటితో కలిపితే మొత్తం అప్లికేషన్ల సంఖ్య 9.24 లక్షలకు చేరింది. అయితే వాటిని అప్పటి ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ధరణి చట్టంలోనూ సాదాబైనామా ద్వారా పాస్‌బుక్కులు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి స్టే విధించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తెచ్చిన భూభారతి చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వెసులుబాటు కల్పించింది. అయితే హైకోర్టు స్టే ఎత్తివేస్తేనే పాత అర్జీలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో పాతవాటితోపాటు కొత్త దరఖాస్తులు కూడా వస్తున్నాయి. కొత్త దరఖాస్తులను పరిష్కరించే వెసులుబాటు భూ భారతి చట్టంలో లేదు. ఇక ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపరంగా పరిశీలిస్తే సాదాబైనామా కోసం వచ్చిన దరఖాస్తుల్లో జగిత్యాలలోనే అధికంగా ఉన్నాయి. అదే సమయంలో సిరిసిల్లలో పీవోటీ (ప్రీవెన్షన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లాలో పీవోటీ కేసులు అత్యల్పంగా ఉన్నాయి.

పీఓటీ కేసులు ఎక్కువే..

నిబంధనల ప్రకారం అసైన్డ్‌ ల్యాండ్స్‌ అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతర పేదలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్స్‌(ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) యాక్ట్‌– 1977 తీసుకొచ్చింది. చాలామంది పేదలు తమ అవసరాల కోసం అసైన్డ్‌ ల్యాండ్స్‌ను అమ్ముకున్నారు. కొనుగోలుదారులు కూడా అసైన్డ్‌ ల్యాండ్‌ పొందగలిగిన పేదవారే అయితే రీఅసైన్‌ చేసే వెసులుబాటును ప్రభుత్వం పలుమార్లు కల్పించింది. రాష్ట్రంలో చివరిసారిగా 2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇలాంటి అవకాశం కల్పిస్తే చాలామంది వినియోగించుకున్నారు. 2017 తర్వాత అసైన్డ్‌ ల్యాండ్స్‌ కొనుగోలు చేసినవారికి ఈ వెసులుబాటు వర్తించదు. కానీ.. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో 2017 తర్వాత అసైన్డ్‌ ల్యాండ్‌ కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి రీఅసైన్‌మెంట్‌ కోసం అర్జీలు వస్తున్నాయి. మొత్తం అర్జీల్లో 15 నుంచి 20 శాతం వరకు ఇవే ఉంటున్నాయి. దీన్ని బట్టి ఒక్కో మండలంలో వందల సంఖ్యలో అసైన్డ్‌ ల్యాండ్స్‌ చేతులు మారినట్లు తెలుస్తోంది. అలాగే కొందరు తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ, ఫారెస్ట్‌ భూ ములకు పట్టాలివ్వాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇలాంటివారికి కొత్తగా భూమి అసైన్‌ చేయాలంటే ఎమ్మెల్యేల అధ్యక్షతన ల్యాండ్‌ అసైన్‌మెంట్‌ కమిటీలు నియమించాల్సి ఉంటుంది.

ఉమ్మడి జిల్లా వివరాలు

జిల్లా సాదాబైనామా సర్వే నంబరు మిస్సింగ్‌ పీవోటీ

పెద్దపల్లి 4569 2149 30

కరీంనగర్‌ 2204 1162 40

సిరిసిల్ల 1523 1180 948

జగిత్యాల 6360 3192 76

సివిల్‌, మిస్సింగ్‌ సర్వే నంబర్లు

కుటుంబ సభ్యుల మధ్య భూమి వాటాల పంపకాల్లో వచ్చిన తేడాలు, ఒకరి భూమిని మరొకరు పట్టా చేయించుకోవడం, ఒకరి భూమిపై మరొకరు కబ్జాలో ఉండడం, భూమి హక్కుపై వారసత్వం విషయంలో వివాదం, ధరణిలో, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో డబుల్‌ రిజిస్ట్రేషన్లు వంటి అనేక సివిల్‌ వివాదాలపై అప్లికేషన్లు వచ్చాయి. ఇలాంటి వివాదాల పరిష్కారం కూడా తహసీల్దార్ల చేతుల్లో లేదు. వీటి పరిష్కారానికి రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కోర్టులే పిటిషన్లను విచారించి హక్కుదారులను తేల్చాల్సి ఉంటుంది. భూ వివాదాలకు సంబంధించి మరో ప్రధాన సమస్య.. మిస్సింగ్‌ సర్వేలకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement