విజయనగరం టౌన్: శారీరక దృఢత్వాన్ని పెంపొందించేవి క్రీడలని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, సమయపాలన, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న 473 మంది మహిళా కానిస్టేబుల్స్కు రెండు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్ను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలన్నారు. శారీరక దారుఢ్యం ప్రతి పోలీసు అధికారికి వృత్తిపరమైన బాధ్యతగా భావించాలని సూచించారు. ఓటమి అంతిమం కాదని, అది మరింత మెరుగ్గా ఎదగడానికి ఒక అవకాశమన్నారు. ప్రతి పోటీ నుంచి ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డి.కోటేశ్వరబాబు, డీఎస్పీలు పి.రమేష్, ఎం.చంద్రశేఖర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, కళాశాల సిబ్బంది, శిక్షణ అధికారులు, మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులు పాల్గొన్నారు.
పాల్గొన్న 473 మంది శిక్షణ కానిస్టేబుల్స్


