సాలూరు రూరల్: రానున్న స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పని చేసి వైఎస్సార్సీపీ విజయం సాధించేలా కృషి చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గత జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తూ ఓటు అడగాలని, ఓటరుగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో పట్టణ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందన్నారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించిందని, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకం ఉందన్నారు.
మంత్రికి కక్ష సాధింపులే తప్ప హామీలు గుర్తుండవు..
గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి కక్ష సాధింపులే తప్ప ఇచ్చిన హామీలు గుర్తుకు రావని రాజన్నదొర ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చిరుద్యోగులపై కక్ష సాధించిన తీరు ప్రజల్లో గుర్తుందన్నారు. దళిత, గిరిజన మహిళలని చూడకుండా అన్ని వర్గాల వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడున్నారన్నారు. ఈ తరుణంలో మంత్రి సంధ్యారాణి తీరుపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. తన ఎమ్మెల్యే పదవీ కాలంలో ఏ ఒక్క ఉద్యోగిని ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. మంత్రి అయిన వెంటనే పట్టణంలో మరుగుదొడ్లుపై మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడిన మంత్రి ఇప్పుడు ఉన్న మరుగుదొడ్లును పూడ్చేస్తున్నారే తప్ప వాటిని బాగు చేసిన దాఖలాలే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు మహిళల ఆత్మగౌరవం గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఓటు అడగడమే కాదు.. అండగా నిలవాలి
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
గత ప్రభుత్వంలో సంక్షేమం
ప్రజలకు గుర్తు చేయాలి
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర


