న్యూస్రీల్
పార్వతీపురం రూరల్: ధరల భగభగలతో జిల్లాలో సామాన్యుల బతుకు బండి గతి తప్పుతోంది. ఉల్లి, బియ్యం, పంచదారల వెతలు చాలవన్నట్లు.. ఇప్పుడు టమాటో, అల్లం, పచ్చిమిర్చి వంటి కూరగాయల ధరలు కూడా అమాంతం ఎగబాకాయి. పెరిగిన ధరల వడ్డనతో జిల్లాలోని 2.23 లక్షల కుటుంబాలపై ప్రతినెలా సగటున వేల రూపాయిల మేర అదనపు భారం పడుతోంది.
బియ్యం, చక్కెరపై వడ్డన
నాలుగు నెలల వ్యవధిలోనే 26 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,250 నుంచి రూ.1,700కి చేరడంతో ప్రతి ఇంటా నెలకు రూ.450 అదనపు భారం పడుతోంది. ఉల్లి కిలో రూ.60, పంచదార రూ.75కి చేరగా..వంటనూనెలు లీటరుకు రూ.185 దాటాయి. వివిధ రకాల పప్పు దినుసుల ధరలూ కిలోకు రూ.20 చొప్పున పెరిగాయి.
కూరగాయల సెగ
మార్కెట్లో ప్రస్తుతం టమాటో కిలో రూ.50 పలుకుతుండగా, మిగిలిన ఏ కూరగాయ చూసినా కనీస ధర రూ.40 నుంచే మొదలవుతోంది. వంటకు ఎంతో కీలకమైన అల్లం, పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్నంటడంతో ఏమీ కొనలేని, తినలేని దుస్థితి నెలకొంది.
సామాన్యుడు ఏ విధంగా జీవనం సాగించాలి? ఆదాయాలు ఏమాత్రం పెరగని పరిస్థితుల్లో, పూటకో రకంగా ధరలు పెంచుకుంటూ పోతే పేద, మధ్యతరగతి ప్రజలు ఏం తిని బతకాలి? కేవలం బియ్యం బస్తాపైనే ఏకంగా అదనంగా రూ.450 భారం పడడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం. ఉల్లి, చక్కెర, వంటనూనెలు, పప్పుల ధరలు సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నాయి. ప్రతినెలా సగటున ఒక్కో కుటుంబంపై వేల రూపాయలు అదనపు భారం పడడం అత్యంత దారుణం. రోజువారీ ఖర్చులు తడిసి మోపెడవుతుంటే బతుకు బండి ఎలా లాగాలి? ఇదే తీరు కొనసాగితే సామాన్యులు పస్తులుండక తప్పదు. తక్షణమే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని ధరలను అదుపు చేసి, ప్రజలను ఆదుకోవాలి
–పాకల సన్యాసిరావు/పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పార్వతీపురం
నింగినంటిన నిత్యావసరాల ధరలు
జేబులకు పడుతున్న చిల్లు
వంటగదిలో మండుతున్న మంటలు
ఏం కొనాలి..ఏం తినాలంటూ ఆందోళన
జిల్లాపై నెలకు రూ.13.60 కోట్ల అదనపు భారం
కిలో రూ.75కు చేరిన పంచదార
రూ.50కి ఎగబాకిన ఉల్లి ఘాటు


