పాచిపెంట: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోషకాహార రంగంలో సాంకేతిక సహకారం అందిస్తున్న ప్రపంచ బ్యాంకు బృందం గురువారం పాచిపెంట మండలంలో పర్యటించింది. కోస్టువలస, పిండ్రంగివలస అంగన్వాడీ కేంద్రాలు, పాచిపెంట పీహెచ్సీ, కేజీబీవీ పాఠశాలను సందర్శించి క్షేత్ర స్థాయిలో పోషకాహార, ఆరోగ్య, సంక్షేమ సేవల అమలును పరిశీలించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులతో ఈ బృందం మాట్లాడి వారికి అందుతున్న పోషకాహారం, వైద్య సేవల వివరాలను తెలుసుకుంది. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సీడీపీఓ, వైద్యాధికారులతో సమావేశమై సేవల అమలు తీరు, ఎదురవుతున్న సమస్యలు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించింది.. అనంతరం కేజీబీవీలో కిశోర బాలికలతో మాట్లాడి వారి ఆరోగ్యం, పోషకాహార పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ బ్యాంకు బందం సభ్యులతో పాటు ఐసీడీఎస్ పీడీ కె.సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య శాఖ సాలూరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కె.శివకుమార్, సీడీపీఓ బొత్స అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


