రామభద్రపురం: పశువులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మండలంలోని కొట్టక్కి పోలీస్ చెక్పోస్టు వద్ద ఎస్ఐ జ్ఞానప్రసాద్ తన సిబ్బందితో గురువారం వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో సాలూరు నుంచి వరుసగా వచ్చిన మూడు బొలెరో వాహనాలను తనికీ చేయగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు వ్యాన్లలో ఏడు ఆవులు, 11 గేదెలు, నాలుగు దున్నలు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండడంతో మూడు వాహనాలతో పశువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించారు.
అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత
రాజాం సిటీ: అక్రమంగా తరలిస్తున్న పశువులను రాజాం పోలీసులు వేరువేరు చోట్ల జరిపిన తనిఖీల్లో గురువారం పట్టుకున్నారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామ జంక్షన్ వద్ద ఎస్సై మహ్మద్ సల్మాన్బేగ్ వాహన తనిఖీలు చేపడుతుండగా గుర్ల మండలం గుజ్జింగివలస గ్రామానికి చెందిన పిన్నింటి సోమినాయుడు బొలెరో వాహనంతో పశువులను తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనంలో ఆరు ఆవులు, ఒక ఎద్దు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అలాగే తమకు అందిన సమాచారం మేరకు అక్రమంగా పశువుల తరలిస్తున్న నాలుగు బొలెరో వాహనాలను గార్రాజుచీపురుపల్లి గ్రామ జంక్షన్ వద్ద పట్టుకున్నామని ఏఎస్ఐ కేవీ రమణ తెలిపారు. ఆ వాహనాల్లో 28 ఆవులు, రెండు ఎద్దులు, ఆరు దూడలను తరలిస్తున్నట్టు గుర్తించి వాహనాలతో పాటు పశువులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాటిని తరలిస్తున్న గుర్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన బూర శివ, పోలయ్యవలస గ్రామానికి చెందిన సిగుడి భార్గవ్, తెట్టంగి గ్రామానికి చెందిన కరగాన రాంబాబు, గోషాడ గ్రామానికి చెందిన మామిడి నాగరాజులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ సల్మాన్ బేగ్ తెలిపారు.


