● జేసీ వైశాలి, ఎస్పీ మాధవ్రెడ్డిలకు వినతిపత్రాలు అందజేసిన జర్నలిస్టులు
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యలు, ప్రభుత్వ భూ కబ్జాలపై కలం ఎత్తినందుకు భోగాపురంలో విశాలాంధ్ర విలేకరి పందిరపల్లి గోవింద్పై జనసేన ఎమ్మెల్యే అనుచరులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. అక్షర సత్యాలపై ఆక్రోశంతో భౌతిక దాడులకు దిగడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వార్తల్లో వ్యతిరేకతలు ఉంటే చట్టబద్ధమైన వివరణ ఇవ్వాలే తప్ప, ఇలా దౌర్జన్యాలకు పాల్పడడం సరికాదన్నారు. ఈ దాడికి నిరసనగా కలెక్టరేట్ ఆవరణలో జర్నలిస్టుల సంఘ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం జేసీ డాక్టర్ ఆర్.వైశాలి, ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డిలకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. కలం గొంతు నొక్కేలా వ్యవహరించిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.


