డ్రగ్స్ వినియోగంపై సమాచారమిస్తే ప్రోత్సాహం
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి
పార్వతీపురం: జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుపుతున్న, వినియోగిస్తున్న వారి సమాచారమిస్తే, వారికి నగదు ప్రోత్సాహమిస్తామని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని ఉక్కు పాదంతో అరికట్టడానికి చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం ఉంటే వారి వివరాలను 1972 కి ఫోన్ చేసి చెప్పాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి మంచి నగదు బహుమతి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నివారణకు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టాలన్నారు. పోలీసులు, ఫారెస్టు, ఎకై ్సజ్శాఖలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలను సేకరించాలని డి–అడిక్షన్ సెంటర్ అధికారిని ఆదేశించారు.
మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం
సమావేశంలో ఎస్పీ ఎస్వీ మాధవ రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కలెక్టర్ నేతృత్వంలో యాక్షన్ ప్లాన్ తయారుచేసి అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో గంజాయ్, డ్రగ్స్ను నిర్మూలించనున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఏఎస్పీ మనీషా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పావని, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


