ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు తోటపల్లి
● నేడు స్వామివారి కల్యాణం
● పూర్తయిన ఏర్పాట్లు
గరుగుబిల్లి: ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా నిలిచింది. పవిత్ర నాగావళి నదీ తీరంలో వెలసిన ఐదున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లను దర్శించుకునేందుకు పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర జిల్లాలతోపాటు ఒడిశా రాష్ట్రంనుంచి వేలాదిమంది భక్తులు నిత్యంవచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. 1968–69లో తోటపల్లిలో ఆలయం నిర్మాణానికి భూమి పూజచేసి కమిటీగా ఏర్పడి దేవాలయ నిర్మాణం పూర్తిచేసి 1972లో ప్రతిష్టించి భక్తులకు స్వామిదర్శనం కల్పించారు. ఆలయంలో పలు నిర్మాణాలను చేపట్టాలనే లక్ష్యంతో తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ ట్రస్టు ఏర్పడి ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది 2025 ఫిబ్రవరిలో ఆలయాన్ని పునఃప్రతిష్ట చేశారు. దీంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధికంగా తరలివస్తున్నారు.
నేడు కల్యాణం
తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈనెల 29న గురువారం సాయంత్రం 5 గంటలనుంచి శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని జొన్నాడ భట్టరు హరికృష్ణమాచార్యులు, రేజేటి పార్థసారథి ఆచార్యులు, వీవీ. అప్పలాచార్యులతో నిర్వహించనున్నారు. ఈ మేరకు కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న శనివారం పవిత్ర నాగావళినదిలో స్వామివారికి శ్రీ చూర్ణోత్సవం శ్రీచక్ర తీర్థస్నానం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించి తమ గోత్రనామాలతో పూజలు చేయించుకోవాలని కోరుతున్నారు. కల్యాణ ఉత్సవాల్లో భాగంగా శ్రీలీలా పార్వతి నాదస్వరం పార్టీతో దక్షిణాది సన్నాయి మేళం, కిచ్చాడవారితో నాదస్వరం కచేరి, రెడ్డి శీతంనాయుడు ఆధ్వర్యంలో గాన కచేరీ ఏర్పాటుచేశారు. భక్తులు, దాతల సహకారాలతో నిర్వహించే ఈ కల్యానంలో భక్తులు అధికంగా పాల్గొనాలని ఈఓ బి.శ్రీనివాస్ కోరుతున్నారు.


