అజిత్ పవార్ మృతికి సంతాపం
విజయనగరం రూరల్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం పట్ల జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం పట్ల జెడ్పీ చైర్మన్ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, ఆయన మరణం ఆ రాష్ట్రానికే కాకుండా దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు.
ఈవీఎం గొడౌన్ తనిఖీ
పార్వతీపురం రూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని ఈవీఎం గోదామును కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా గోదాము సీళ్లను, భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించి, పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. భద్రత విధులపై పోలీసులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తదితరులు పాల్గొన్నారు.
గొంతుకోసుకున్న వ్యక్తి
విజయనగరం క్రైమ్: నగరంలోని అంబటిసత్రానికి చెందిన సంతోష్ (40) బుధవారం గొంతు కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు హటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టూటౌన్ పీఎస్లో కేసు నమోదు కాగా ఎస్సై కృష్ణమూర్తి విచారణ చేస్తున్నారు. మతిస్థిమితం లేని కారణంగా సంతోష్ కత్తితో గొంతుకోసుకున్నట్లు అందిన ప్రాథమిక సమాచారమని సీఐ శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని విచారణ చేస్తున్నామని తెలిపారు.
ఆటో దగ్ధం
పార్వతీపురం రూరల్: కష్టార్జితంతో కొనుక్కున్న ఆటోయే కొండంత అండ. కానీ దుండగుల దుశ్చర్య ఆ బతుకు బండిని బుగ్గిపాలు చేసింది. పట్టణంలోని 17వ వార్డు బెలగాం రైల్వేగేట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భద్రగిరి సత్తిబాబు అనే వ్యక్తికి చెందిన ఆటోను తగులబెట్టారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన సత్తిబాబు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొంత ఇల్లు కూడా లేని తనకు, జీవనాధారమైన బండి అగ్నికి ఆహుతి కావడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
అజిత్ పవార్ మృతికి సంతాపం


