
కౌలురైతు కన్నీరు..!
కూటమికి పట్టని...
● కౌలు రైతుల కార్డుల జారీలో
అంతులేని నిర్లక్ష్యం
● విత్తనాలు రాయితీ లేక ఇబ్బందులు
● అందని పంట రుణాలు
● జిల్లాలో 9వేల మంది కౌలు రైతులు
● ఇప్పటి వరకు అందజేసినవి
940 మాత్రమే..
పార్వతీపురం టౌన్: ఖరీఫ్ సీజన్ ఆసన్నమైంది. కొన్నిచోట్ల వరి వెదలు జల్లుతున్నారు. ఇప్పటికీ కౌలురైతుల గుర్తింపు పూర్తికాలేదు. జిల్లా వ్యాప్తంగా 9వేల మంది కౌలురైతులు ఉంటే 940 మందికి మాత్రమే కౌలు రైతు గుర్తింపు కార్డులు అందజేశారు. దీంతో విత్తనాలు, వ్యవసాయ పరికరాలు రాయితీపై అందని పరిస్థితి. అన్నదాత సుఖీభవకు కౌలు రైతులను దూరం చేసిన కూటమి ప్రభుత్వం.. గుర్తింపు కార్డుల జారీలోనూ జాప్యం చేస్తుండడంపై కన్నీరు పెడుతున్నారు. కొందరు రైతులు కాడివిడిచి వలసబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
వ్యవస్థలు నిర్వీర్యం
గతంలో విత్తనాల పంపిణీ నుంచి పంట కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలు రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేవి. ఆర్బీకేలను ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చి వాటి సేవలను దూరం చేస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. దీనికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు (సీసీఆర్) జారీలో జాప్యమే నిదర్శనమని చెబుతున్నారు. వరి విత్తనాలు, ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను పూర్తిధర చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామని పేర్కొంటున్నారు.
సీసీఆర్ కార్డుతో ప్రయోజనాలు బోలెడు
పెట్టుబడి సాయం, పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి, నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా, పంట రుణాలు ఇలా ఏది వర్తించాలన్నా సీసీఆర్ కార్డులు తప్పనిసరి. ఈ కార్డులుంటేనే రైతులకు అర్హత ఉంటుంది. కౌలుదారులకు కీలకమైన కార్డుల జారీలో జాప్యం నెలకుంది. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో కేవలం 940 మందికి మాత్రమే సీసీఆర్ కార్డులు జారీ చేశారు. వ్యవసాయశాఖ సిబ్బంది కార్డుల జారీకి చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారే తప్ప జూన్నెల పూర్తవుతున్నా కౌలు రైతులకు సీసీఆర్ కార్డు అందని పరిస్థితి నెలకుంది.
ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు..
జిల్లాలో 940 మంది కౌలురైతులకు సీసీఆర్ కార్డులు జారీ చేశాం. మిగిలిన వారిని వీఆర్వోలు ఎంపిక చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కార్డుల జారీకి చర్యలు చేపడతాం. ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం కల్పిస్తాం.
– రాబర్ట్ పాల్, జిల్లా వ్యవశాయశాఖ అధికారి, పార్వతీపురం మన్యం