
వ్యవసాయ పరికరాలు సద్వినియోగం చేసుకోవాలి
పార్వతీపురంటౌన్: ప్రభుత్వ రాయితీపై వ్యవసాయ పరికరాలు పొందిన రైతులు తమ అవసరాలు పోను మిగిలిన రైతులకు ఉపయోగపడేలా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ స్పష్టంచేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల సరఫరా రాయితీ నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతుల అవసరాలను దష్టిలో ఉంచుకొని జిల్లాలో రూ.514.09 లక్షల విలువ గల పరికరాలను 50 శాతం రాయితీతో రూ.227.72 లక్షలకు మంజూరు చేసినట్టు వెల్లడించారు. వీటిని ఇతర రైతులు లబ్ధిపొందాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని రైతులకు సూచించారు. రబీలో వరికి బదులుగా అధిక ఆదాయం తెచ్చిపెట్టే లాభసాటి పంటలైన మొక్కజొన్న, కందులు, చిరుధాన్యాలను సాగుచేయాలన్నారు. అనంతరం 920 మంది చిన్న, సన్నకారు, గిరిజన రైతులకు రూ.2.27కోట్ల రాయితీ నిధుల చెక్కును, కందులు, ఎంటీయూ 1426 సన్నరకం వరి విత్తనాల మినీకిట్లను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్పాల్, ఏపీ ఆగ్రో సంస్థ జిల్లా మేనేజర్ శంకరబాబు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు పాల్గొన్నారు.