
పురం గొంతెండుతోంది!
ఎన్నిసార్లు అడిగినా
స్పందించడం లేదు..
మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. ఎన్నిసార్లు అడిగినా అదిగోఇదిగో అంటున్నారు తప్ప ఫలితం నీటి సరఫరా చేయడం లేదు. కొద్దిరోజులుగా కుళాయిల ద్వారా నీరే రావడం లేదు.
– లక్ష్మి, నాలుగో వార్డు
●
సాక్షి, పార్వతీపురం మన్యం: ఒకటి కాదు.. రెండు కాదు.. పది రోజులుగా పార్వతీపురం పట్టణాన్ని నీటి ఎద్దడి వెంటాడుతోంది. తాగేందుకు నీరులేక పుర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ సమ్మె చేస్తుండటం నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చెంతనే తోటపల్లి జలాశయం అగుపిస్తున్నా.. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మున్సిపల్ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందంటూ పట్టణ ప్రజలు దుయ్యబడుతున్నారు.
మహిళల నిరసనతోనూ దిగిరాని అధికారులు
30 వార్డులున్న పార్వతీపురం పట్టణంలో కుళాయిల ద్వారా నీటి సరఫరా అరకొరగానే లభిస్తోంది. ఐదు రిజర్వాయర్లు ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకోసారి, మరికొన్ని చోట్ల వారానికోసారి ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇంజినీరింగ్ వర్కర్ల సమ్మెతో అది కూడా రావడం లేదు. పట్టణంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నాలుగు రోజుల కిందట పలు వీధుల మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. జనసైనికులు కూడా ఇందులో పాల్గొనడం గమనార్హం. ఆ తర్వాత ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేశారు. కొన్ని వార్డులను వదిలేశారు. ఇస్తున్న చోట మహిళలు, పురుషులనే తేడా లేకుండా బిందెలు పట్టుకుని నిరీక్షిస్తున్నారు. దొరికితే మహాభాగ్యమనుకుని.. కొద్ది రోజులపాటు నిల్వ చేసుకుంటున్నారు.
ఇక్కడా వివక్షే..
ట్యాంకర్ల ద్వారా కూటమి నేతృత్వం వహిస్తున్న, మద్దతుగా నిలిచిన కౌన్సిలర్లు ఉన్న వార్డులకే సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులను వదిలేశారు. ఆయా ప్రాంతాల్లో పాలకవర్గం వైఫల్యం వల్లే నీటి ఎద్దడి ఏర్పడిందని ప్రచారం చేయిస్తున్నారు. దీనికి మున్సిపల్ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల సమస్యలపైనా రాజకీయాలేమిటని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా నీటి సమస్యను పరిష్కరించి, కుళాయిల ద్వారా సరఫరా చేయాలని కోరుతున్నారు.

పురం గొంతెండుతోంది!

పురం గొంతెండుతోంది!