
డయేరియా మరణాలు ఉండరాదు
పార్వతీపురం టౌన్:
జిల్లాలో డయేరియా మరణాలు సంభవించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అతిసార వ్యాధి నివారణపై వాల్పోస్టర్లను జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, వైద్యాధికారులతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వర్షాకాలం రానున్న నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 16 నుంచి వచ్చేనెల 31వ తేదీ వరకు అతిసారవ్యాధి నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 0–5 ఏళ్ల లోపు వయస్సు గల చిన్నారులకు డయేరియా మరణాలు జరగకుండా చూడడం కార్యక్రమ ముఖ్యఉద్దేశమని కలెక్టర్ గుర్తుచేశారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ మరియు జిల్లా ఆస్పత్రుల వద్ద దీనినివారణ కోసం ఓఆర్ఎస్, జింక్ కార్నర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. పిల్లల తల్లులకు అవగాహన కోసం ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు, పారా మెడికల్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఓఆర్ఎస్ ద్రావణం తయారీ, జింక్ మాత్రలు వాడేవిధానం, చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకతపై శిక్షణలో వివరించాలన్నారు. ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారులు డా.టి.జగన్మోహనరావు, డా.ఎం.వినోద్కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి బి.రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్