
మా బడిని మా ఊరిలోనే ఉంచండి
బలిజిపేట: మా బడి మా దళితపేటలోనే ఉంచాలని, మా వలస కుటుంబాల పిల్లలకు న్యాయం చేయాలని, దళితులమని ఆగ్రహించకుండా ఆలోచించి న్యాయం చేయాలంటూ పెదపెంకి దళితపేటకు చెందిన పాఠశాల–1 విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం రోడ్డెక్కారు. పెదపెంకి దళితపేటలో ఉండే ఒకటో నంబరు పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించడంతో ఆందోళనకు దిగారు. 50 సంవత్సరాల నుంచి దళితపేటలో ఉండే బడిని గ్రామస్తులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించకుండా, చైర్మన్, ప్రజల అంగీకారం లేకుండా మరో పాఠశాలలో ఎలా విలీనం చేశారని ప్రశ్నిస్తున్నారు. గాలులు, వర్షాలుపడే సమయంలో దూరంగా ఉన్న పాఠశాలలకు పిల్లల ఎలా వెళ్లిరాగలరని నిలదీశారు. బడి ఎత్తేస్తే పిల్లలను నచ్చిన చోట చేర్చుకుంటామని స్పష్టంచేశారు. సమస్యను పరిష్కరించకపోతే జిల్లాస్థాయిలో ధర్నాకు సిద్ధమన్నారు. ఈ మేరకు ఎంఈఓ–1 సామల సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ పాఠశాలను ఎత్తేయలేదని, కేవలం 3, 4, 5 తరగతుల విద్యార్థులను మాత్రమే తరలించినట్టు చెప్పారు. తల్లిదండ్రులు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మా బడిని మా ఊరిలోనే ఉంచండి