
రెచ్చిపోతున్న పోకిరీలు
● సతివాడలో పాఠశాలల సముదాయంలో వికృత చేష్టలు
● ఉదయం, సాయంత్రం వేళల్లో మితిమీరుతున్న ఆగడాలు
● అలంకార ప్రాయంగా నిఘానేత్రాలు
● ఆందోళనలో బాలికల తల్లిదండ్రులు
● పోకిరీల ఆట కట్టించాలని పోలీసులకు విజ్ఞప్తి
నెల్లిమర్ల రూరల్: విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్నో ఆశలతో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో చదువుకునేందుకు కొత్తగా చేరుతున్నారు. అప్పటికే చదువుతున్న విద్యార్ధులు బ్యాగులు చేతబట్టి చదువులో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కొంతమంది పోకిరీల వికృత చేష్టలు కూడా అధికమయ్యాయి. మండలంలోని సతివాడ గ్రామంలో పక్కపక్కనే ఆదర్శపాఠశాల, ఉన్నత పాఠశాల, బాలికల వసతి గృహంతో పాటు ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నాయి. సమీప 25 గ్రామాలకు చెందిన విద్యార్ధులు పై చదువులు చదివేందుకు సతివాడ అనువైన ప్రదేశం. ఆయా విద్యాసంస్థలకు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ వందలాది మంది బాలికలు చదువును సాగిస్తున్నారు. పోకిరీల ఆగడాలు మితిమీరడంతో తమ పిల్లల భద్రతకు ముప్పు పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెవులు పగిలేలా సౌండ్లు..గుండెలదిరేలా స్టంట్లు
సతివాడలోని విద్యాసంస్థల వద్ద కొన్ని రోజులుగా పోకిరీల వికృత చేష్టలు అధికమయ్యాయని స్థానికులతో పాటు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో అలాగే మధ్యాహ్నం 3;30గంటల నుంచి 4 గంటల సమయం వరకు సమీప గ్రామాలకు చెందిన కొంతమంది యువకులు బైక్లపై నిత్యం రెక్కీ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. బాలికలు నడిచి వెళ్తున్నప్పుడు బైక్లపై వారిని అనుసరిస్తూ అసౌకర్యానికి గురి చేస్తున్నారని అక్కడి వర్తక వ్యాపారులే స్వయంగా చెబుతుండడం గమనర్హం. అత్యంత వేగంతో బైక్ రైడ్ చేస్తూ చెవులు పగిలేలా సౌండ్ హార్న్లు కొడుతున్నారని, గుండెలదిరేలా బైక్లపై ఫీట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఎవరు ప్రశ్నించినా వినే పరిస్థితిలో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలంకార ప్రాయంగా నిఘా నేత్రాలు..
సతివాడ ఉన్నత పాఠశాల వద్ద కొన్నేళ్ల క్రితం అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో వాటికి స్టోరేజ్ సౌకర్యం కల్పించకపోవడంతో కేవలం లైవ్ కవరేజ్ తప్ప డేటా నిక్షిప్తం కావడం లేదు. ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే జరిగిన ఆ ఘ టనను చూసేందుకు ఆస్కారం లేదని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. దీంతో విద్యాసంస్థల సముదాయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకార ప్రా యంగానే మారాయి. ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో ఇటీవల ఓ దాత సహకారంతో ఉన్నత పాఠశాల వద్ద ఒక సీసీ కెమెరాను స్థానిక పోలీసులు ఏర్పాటు చేశారు. అధునాతన సీసీ కెమెరాలకు కూడా స్టోరేజ్ సౌకర్యాన్ని కల్పిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని, పోకిరీల ఆట కూడా కట్టించవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కౌన్సెలింగ్ ఇస్తే మంచి ఫలితాలు
విద్యాసంస్థల వద్ద అల్లరి చేష్టలు చేస్తున్న పోకిరీలపై పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది పోకిరీల చేష్టలు పెరుగుతూ వస్తున్నాయి. నియంత్రణ లేకపోవడంతో జరగకూడని ఘటనలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెడ్డ పేరు రాకముందే మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అటువంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే అదుపులో ఉండే అవకాశం ఉందని ఆభిప్రాయ పడుతున్నారు.
అడ్డూ అదుపు లేకుండా పోతోంది:
సతివాడ విద్యా సంస్థల వద్ద కొంతమంది నిత్యం బైక్లపై మితి మీరిన వేగంతో వెళ్తూ హడలెత్తిస్తున్నారు. వారి చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కొంతమంది యువత నిత్యం పహారా కాస్తున్నారని మా పిల్లలు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పోకిరీలను అదుపులో పెట్టాలి.
పంచాది శ్రీనివాసరావు, వల్లూరు గ్రామం
పూర్తిస్థాయిలో నిఘా పెడతాం:
సతివాడలోని విద్యాసంస్థల సముదాయం వద్ద పూర్తిస్థాయిలో నిఘా పెడతాం. మఫ్టీలో విధులు నిర్వహించి అల్లరి చేష్టలకు పాల్పడుతున్న పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకుంటాం. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు స్టోరేజీ సదుపాయం లేకపోవడంతో కొత్తగా ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశాం. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి ప్రజలు, యువకులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా బాలికల జోలికి వెళ్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి.
గణేష్, ఎస్సై, నెల్లిమర్ల

రెచ్చిపోతున్న పోకిరీలు

రెచ్చిపోతున్న పోకిరీలు