
సికిల్ సెల్ వ్యాధికి రక్తమార్పిడే చికిత్స
● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: సికిల్ సెల్ వ్యాధికి రక్తమార్పిడే చికిత్స అని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పోగ్రాం అధికారులతో సికిల్సెల్, డయేరియా వ్యాధులపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సికిల్సెల్ వ్యాధి ఉన్న వారు హిమటాలజిస్ట్, సాధారణ వైద్యుడి సంరక్షణలో చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమతుల ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించకపోయినా, సురక్షిత మంచినీరు తీసుకోకపోయినా డయేరియా వ్యాధి వస్తుందన్నారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్. సూర్యనారాయణ, డీపీహెచ్ఎన్ఓ మామిడి సత్యవతి, డెమో చిన్నతల్లి పాల్గొన్నారు.
అట్రాసిటి కేసుపై డీఎస్పీ దర్యాప్తు
వంగర: మండల పరిధి కొప్పరవలస సమీపంలో కొండచాకరాపల్లి ఐటీడీఏ కాలనీకి చెందిన గిరిజన యువకుడిని కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ఘటనపై చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు బుధవారం దర్యాప్తు నిర్వహించారు. ఐటీడీఏ కాలనీకి చెందిన బంటుపల్లి శంకరదొర శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతుండడంతో అక్కడికి వెళ్లి వివరాలు సేకరించిన అనంతరం కొప్పరవలస సమీపంలో సంఘటన జరిగిన ప్రదేశంలో డీఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారి తీసిన అంశాలపై వివరాలు సేకరించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై షేక్ శంకర్, పలువురు ఉద్యోగులు ఉన్నారు.
9 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు
పూసపాటిరేగ: మండలంలోని కనిమెట్ట గ్రామంలో అనధికారంగా మద్యం కలిగి వున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ బుధవారం తెలియజేశారు. అనధికారంగా 9 మద్యం సీసాలు కలిగి ఉండడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అనధికారికంగా మద్యం అమ్మినట్లయితే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతా మన్నారు. దాడుల్లో ఎస్సై చంద్రమోహన్, సురేష్, సిబ్బంది సత్యనారాయణ, మహేష్ పాల్గొన్నారు.
రెండు కేజీల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి నిందితులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ పీఎస్ పరిధి జమ్ములో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా రూరల్ ఇన్చార్జ్ సీఐ శ్రీనివాస్, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుకున్న ఇద్దరు నిందితులను విజయనగరంలోని సాకేటి వీధికి చెందిన తేజస్వరూప్, సాయిలుగా గుర్తించి వారి దగ్గర నుంచి రెండు కేజీల 310 గ్రాముల గంజాయిని మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.

సికిల్ సెల్ వ్యాధికి రక్తమార్పిడే చికిత్స

సికిల్ సెల్ వ్యాధికి రక్తమార్పిడే చికిత్స