
జీఎస్టీ వసూలు చేసి రెవెన్యూ పెంచాలి
విజయనగరం అర్బన్: జీఎస్టీ, బకాయిలు వసూలు చేయడం ద్వారా జిల్లా రెవెన్యూను పెంచడానికి కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. జిల్లాలో మొదటి త్రైమాసికంలో 85 శాతం మాత్రమే జీఎస్టీ చెల్లింపులు జరిగాయని ఇది శతశాతానికి చేరాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీఎస్టీ అధికారులతో పాటు పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేరితేనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని, జీఎస్టీ, బకాయిల వసూలులో జిల్లా అధికారులు సహకరించాలని కోరారు. సర్వీస్ టాక్స్, గూడ్స్ టాక్స్ చెల్లించలవలసి ఉంటుందని రిజిస్ట్రేషన్లు పెంచడం ద్వారా రెవెన్యూ పెరుగుతుందన్నారు. జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈల వివరాలను కొత్తగా స్థాపించిన పరిశ్రమల వివరాలను పరిశ్రమల శాఖ వారు జీఎస్టీ కార్యాలయానికి ఇవ్వాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వాణిజ్య సముదాయాల వివరాలను మున్సిసపల్ కమిషనర్ అందజేయాలన్నారు. పాత బకాయిల వివరాలను జీఎస్టీ శాఖ అందించాలని వాటిని బ్యాంకులకు అందజేయడం ద్వారా బకాయిలు వసూలయ్యేలా ఎల్డీఎం చూడాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు ప్లాట్స్ను కట్టి అమ్మేస్తున్నారని జీఎస్టీ చెల్లించడం లేదని వాటి వివరాలను కూడా రిజిస్ట్రేషన్ శాఖ అందజేయాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, ఎల్డీఎం రమణమూర్తి, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ వల్లి, అసిస్టెంట్ కమిషనర్లు అచ్చయ్య, రమేష్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్

జీఎస్టీ వసూలు చేసి రెవెన్యూ పెంచాలి