
జిందాల్ బెంబేలు..!
యంత్రాలు అడ్డుకుని జిందాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిర్వాసిత రైతులు
కల్లబొల్లి కబుర్లు చెప్పి..భూములు లాక్కుని..
2008లో అప్పటి జెడ్పీటీసీ, నేటి ఎమ్మెల్సీ రఘురాజులు తమ బతుకులు బాగుపడతాయని చెబితే భూములిచ్చాం. అప్పుడు కంపెనీ మాకు స్కూళ్లు, ఆస్పత్రులులు, పార్కులు కడతాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం. 60యేళ్లు దాటిన వాళ్లకి పెన్షన్ ఇస్తాం. ఇళ్లు పోయిన వాళ్లకి ఇళ్లు కట్టిస్తాం, బోర్లు వేయిస్తాం. షెడ్లు కట్టిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ప్రభుత్వాల్లో పెద్దలకు సూట్కేసులు ఇచ్చి, భూములు అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలని వస్తున్నారు. కోట్లు విలువ చేసే భూమికి ప్రభుత్వ ధర అనిచెప్పి కారు చౌకగా కొట్టేశారని వాపోయారు. ప్రభుత్వాలకు నిర్వాసితుల గోడు పట్టదా? పార్టీల పెద్దలు, ప్రజాసంఘాలు, అధికారులు, మీడియా అందరికీ నాడు జిందాల్ ఇచ్చిన హామీలు తెలియవా? అన్నీ కాగితాలపై ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవ్వరూ మాకు మద్దతు ఎందుకు ఇవ్వరు? డబ్బున్నోళ్లకే వత్తాసు పలుకుతారా? అంటూ నిలదీశారు. తమలో సహనం చచ్చిందని ఇంకా బెదిరించాలని, తొక్కేయాలని చూస్తే తిరుగుబాటుకు సిద్ధమని తేల్చిచెప్పారు. జిందాల్ వ్యవహారంపై రాష్ట్రపతికి లేఖ రాస్తామన్నారు. జిందాల్ యాజమాన్యం మాకు ఇచ్చిన హామీలు తీర్చనప్పుడు మాభూములతో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
కూటమి పెద్దలకు ముడుపులు
జిందాల్ పెద్దలు కేంద్రంలో పెద్దల్ని, కూటమిపెద్దల్ని కలిసి ముడుపులు ఇచ్చేసి భూమిపూజకు వచ్చేయండి అని చెప్పడం..ప్రభుత్వ పెద్దలు తలాడించి సిద్ధమవడానికి సిగ్గు లేదా? అంటూ మండిపడ్డా రు. జిందాల్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు తమ న్యా యపరమైన డిమాండ్లు తీర్చి, తమకు ఇవ్వాల్సిన రాయితీలు ఇచ్చి, సౌకర్యాలు కల్పించాలని, తమ కు ఎలా ఉపాధి కల్పిస్తారో తేల్చి చెప్పకుండా పనులు అంటూ భూముల్లోకి వస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ నిర్వాసితులు స్పష్టం చేశారు.
● పనులు అడ్డుకున్న నిర్వాసితులు
● భవిష్యత్పై భరోసా ఇవ్వాలని నినాదాలు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన జిందాల్ యాజమాన్యం
● వెనక్కి తగ్గని నిర్వాసితులు
శృంగవరపుకోట: మా భూములు లాక్కుని మాకు భవిష్యత్ లేకుండా చేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూలోళ్లను చేశారు. కంపెనీ పేరుతో భూములు లాక్కుని 18ఏళ్లు ఉంచుకుని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటే మేము చేతులు ముడుచుకుని కూర్చోవాలా..? మాభూమలు మేము సాగుచేస్తాం..? అవసరమైతే ప్రాణాలు పోయినా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం..అంటూ జిందాల్ నిర్వాసితులు తెగేసి చెప్పారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ముషిడిపల్లి పంచాయతీ పరిధి దాసుళ్లపాలెం వద్ద భూముల్లో జిందాల్ యాజమాన్యం పనులు చేసేందుకు జేసీబీలను, కూలీలను పంపింది. ఈ విషయం తెలుసుకున్న జిందాల్ నిర్వాసిత గ్రామాల రైతులు, మహిళలు అక్కడికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. యంత్రాలు, మనుషులు అంతా తమ భూములు వదిలి బయటకు వవెళ్లాలని లేకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ధ్వజమెత్తారు. మా బతుకులకు భరోసా ఇవ్వండని అడిగితే మాట్లాడని జిందాల్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఏ హక్కుతో మా భూముల్కోకి వస్తున్నారు. నమ్మించి గొంతు కోసి, బతుకులు బుగ్గి చేసి, ఇప్పుడు వ్యాపారానికి రెడీ అయిపోతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు గట్టిగా అడ్డుకోవడంతో జిందాల్ ప్రతినిధులు ఎస్.కోట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో ఏఎస్సై గోవిందరావు సిబ్బంది వచ్చి నిర్వాసిత రైతులతో మాట్లాడుతూ పనులు అడ్డుకోవద్దని, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, పోలీస్ బందోబస్తు ఇచ్చైనా పనులు చేయిస్తామని చెప్పడంతో రైతులు భీష్మించి మధ్యాహ్నం 2గంటల వరకూ కూర్చున్నారు.