
యథేచ్ఛగా గ్రావెల్ రవాణా
రాజాం: మండలంలోని పొగిరి గ్రామ సమీప ప్రాంతాల నుంచి గ్రావెల్ యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది. ఈ ప్రాంతానికి చెందిన పలువురు ట్రాక్టర్లు, పొక్లెయిన్ల యజమానులు గ్రావెల్ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. పొగిరి చుట్టు పక్కల సాగునీటి చెరువులు, కంకర దిబ్బల నుంచి గ్రావెల్ సేకరించి రాజాం పట్టణంలోని పలు నిర్మాణాలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్ ధర రూ.800లు దాటి పలుకుతుండడంతో ఈ దందా అధికంగా జరుగుతోంది. ప్రభుత్వభూములు, సాగునీటి వనరుల్లో కంకర గ్రావెల్ మాయమవుతుండడంతో ఆయా గ్రామాల్లోని చెరువుల ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాను నిలువరించాలని కోరుతున్నారు. పొగిరి గ్రామం నుంచి ఈ అక్రమ రవాణా అధికంగా ఉందని, అధికారులు చర్యలు చేపట్టాలని పొగిరి గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రావెల్ అక్రమరవాణాపై రాజాం తహసీల్దార్ రాజశేఖరం వద్ద సాక్షి ప్రస్తావించగా గ్రావెల్ అక్రమ రవాణాపై దృష్టిసారిస్తామని వెల్లడించారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరిపితే తమ కార్యాలయానికి, సంబంధిత వీఆర్ఓకు ఫిర్యాదుచేయాలని సూచించారు. పొగిరి గ్రామ పరిసర ప్రాంతాల్లోని గ్రావెల్ రవాణాపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.