అనధికార దత్తతతో అగచాట్లు..! | - | Sakshi
Sakshi News home page

అనధికార దత్తతతో అగచాట్లు..!

Jun 19 2025 4:20 AM | Updated on Jun 19 2025 4:20 AM

అనధికార దత్తతతో అగచాట్లు..!

అనధికార దత్తతతో అగచాట్లు..!

గుట్టుగా జరుగుతున్న దత్తత వ్యవహారం

రిజిస్ట్రేషన్‌ చేసుకుని కొంతమంది దత్తత

చట్టబద్ధంగా తీసుకుంటే శిశువుకు హక్కులు

విజయనగరం ఫోర్ట్‌: డెంకాడ మండలానికి చెందిన దంపతులు మగ శిశువును తెలిసిన వారి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో దత్తత తీసుకున్నారు. అయితే అశిశువుకు జనన ధ్రువీకరణ పత్రం అవసరం పడడంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే జనన ఽధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో వారు ఐసీడీఎస్‌ కార్యాలయంలో సంప్రదించగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో వెళ్లి అడగాలని చెప్పడంతో వెనుదిరిగారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారుల దృష్టికి రాకుండా అనధికారికంగా దత్తత ఇచ్చేస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అఽనధికారికంగా దత్తత ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు పదేపదే చెబుతున్నారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. గుట్టుగా పిల్లలను దత్తత ఇచ్చేస్తున్నారు. కొంతమంది పిల్లలను దత్తత ఇచ్చే తల్లిదండ్రులకు డబ్బులు, బంగారం వంటివి ఇచ్చి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది గర్భం దాల్చిన వారు వైద్యఖర్చులు భరించిన వారికి పిల్లలను దత్తత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దత్తత పేరిట విక్రయాలు

అభంశుభం పిల్లలను బాహ్య ప్రపంచం తెలియకుండానే కన్నతల్లి ముఖం చూడకుండానే ఇంకొకరికి ఇచ్చేస్తున్నారు. పోనీ అనధికారికంగా దత్తత ఉచితంగా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. వేలు, లక్షలు తీసుకుని పిల్ల లను దత్తత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడపిల్ల అయితే రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర..మగ పిల్లవాడు అయితే రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అజ్ఞాతవ్యక్తుల సమాచారంతో..

గ్రామీణ ప్రాంతంలో బాల్య వివాహాలు జరిగినా, అనధికారికంగా దత్తత ఇచ్చినా ఐసీడీఎస్‌ అధికారులకు అంగన్‌వాడీలు తెలియజేయాలి. కానీ అంగన్‌వాడీలు ఈ విషయాలను అధికారులకు తెలియజేయడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అజ్ఞాత వ్యక్తులు సమాచారం ఇస్తే అధికారులకు అనధికారిక దత్తత, బాల్య వివాహాల గురించి తెలుస్తోంది.

పర్యవేక్షణ కరువు

అనధికారికంగా పిల్లలను దత్తత ఇచ్చిన వారిని గుర్తించి తిరిగి ఆ శిశువులను తల్లిదండ్రులకే అప్పజెప్పినప్పుడు 6 నెలల వరకు పర్యవేక్షణ చేయాలి. శిశువును మళ్లీ ఎవరికై నా దత్తత ఇచ్చేశారా? లేదంటే వారే పెంచుతున్నారా? అనేది ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పర్యవేక్షించాలి. కానీ అటువంటి పర్యవేక్షణ చేయడం లేదనే తెలుస్తోంది.

చట్టప్రకారం దత్తత తీసుకోవాలి

పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకోవాలంటే ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే పిల్లలు దత్తత తీసుకోవాలనుకున్న తల్లిదండ్రులు ఆరోగ్యవంతులై ఉండాలి, ఆర్థికస్థితి బాగుండాలి. ఎటువంటి వ్యాధులు ఉండకూడదు. పిల్లలు పుట్టరని వైద్యుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి. అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి అర్హులు అనుకుంటే అప్పుడు దత్తత ఇస్తారు.

అనధికారిక దత్తతతో చిక్కులు

అనధికారిక దత్తతతో అనేక చిక్కులు ఉన్నాయి. వారికి జనన ధ్రువీకరణ పత్రం రాదు. అదేవిధంగా దత్తత వెళ్లిన పిల్లలకు హక్కుల కోసం పోరాటం చేయడానికి వీలుండదు. దీని వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి.

అనధికారిక దత్తత చెల్లదు:

అనధికారిక దత్తత తీసుకుంటే అది చెల్లదు. చట్ట ప్రకారమే పిల్లలను దత్తత తీసుకోవాలి. అనధికారికంగా దత్తత తీసుకుంటే చర్యలు తీసుకుంటాం.

టి.విమలరాణి, పీడీ, ఐసీడీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement