బియ్యం దొంగలను వదిలేస్తారా..! | - | Sakshi
Sakshi News home page

బియ్యం దొంగలను వదిలేస్తారా..!

Jun 16 2025 6:57 AM | Updated on Jun 16 2025 6:57 AM

బియ్యం దొంగలను వదిలేస్తారా..!

బియ్యం దొంగలను వదిలేస్తారా..!

సంఘటన జరిగి పది రోజులవుతున్నా ఎక్కడ నుంచి తరలించారో తేల్చని వైనం

బొండపల్లి మండలంలో పెద్ద ఎత్తున పీడీఎస్‌ బియ్యం

కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు

విజయనగరం ఫోర్ట్‌: పీడీఎస్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదు.. అక్రమార్కులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ దగ్గర నుంచి మంత్రుల వరకు ప్రగల్భాలు పలికారు. కాని వారి మాటలు ఉత్తుత్తివేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పీడీఎస్‌ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడినప్పటికీ అసలు దొంగలను ఇప్పటకీ పట్టుకోకపోవడంపై అధికారుల తీరుపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలకు అందించే పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందనే విమర్శలున్నాయి. పీడీఎస్‌ బియ్యం తరలించే వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. జిల్లాలో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించే పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముఠాకు కొంతమంది అధికారులు, డీలర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇందుకోసం వారికి పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం.

బొండపల్లి మండలంలో పట్టుబడిన పీడీఎస్‌ బియ్యం..

పేద ప్రజలకు అందించే పీడీఎస్‌ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. బియ్యం తరలింపుపై విజిలెన్స్‌ అధికారులకు సమాచారం రావడంతో కొద్ది రోజుల కిందట బొండపల్లి మండలం కొండకిండాంలోని కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం.. కిండాం అగ్రహారం మామిడితోటలో 43 క్వింటాళ్ల ిపీడీఎస్‌ బియ్యం పట్టుకున్నారు. రేషన్‌ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్‌ బియ్యం కోళ్ల ఫారంకు, మామిడి తోటల్లోకి తరలించడం సంచలనంగా మారింది. అయినప్పటకీ అధికారులు ఇంతవరకు అసలు దొంగలను పట్టుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

ఏ డిపో బియ్యమో తేలలేదు..

జూన్‌ 5వ తేదీన పీడీఎస్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంఘటన జరిగి పది రోజులవుతున్నా ఏ రేషన్‌ దుకాణం నుంచి నేరుగా తరలించారో.. ఎవరు సహకరించారో.. ఇంతవరకు తేలలేదు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చడానికి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విచారణ చేస్తున్నాం..

పీడీఎస్‌ బియ్యాన్ని తరలించిన వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. వారు ఎక్కడ నుంచి బియ్యం తరలించారో విచారిస్తున్నాం. అసలు దొంగలను పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటాం.

కె. మధుసూదనరావు,

జిల్లా పౌరసరఫరాల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement