దాడులకు పాల్పడేవారిని వదిలేది లేదు
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడే టీడీపీ గూండాలను వదిలేది లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త మందా సాల్మన్ను అదే గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన మోటమర్రి పేతురు బుధవారం ఇనపరాడ్డుతో విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు. గాయాలపాలైన మందా సాల్మన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. విషయం తెలుసుకున్న కాసు మహేష్రెడ్డి హుటాహుటిన గుంటూరు జీజీహెచ్కు వెళ్లి, బాధితుడి ఆరోగ్య స్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసు మాట్లాడుతూ ఇటువంటి దాడులకు పాల్పడిన టీడీపీ మూకలను వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. 2029లో రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని, దాడులకు పాల్పడిన ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టపరమైన శిక్షలు తప్పవన్నారు. టీడీపీ మూకలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారులను సైతం రేపు వదిలి పెట్టేది లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పిన్నెల్లి గ్రామం వదిలి వేరే గ్రామాల్లో నివసిస్తున్నప్పటికీ గ్రామాల్లో అడుగుపెడితే ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నాయకులు వెనకాడటం లేదని, అటువంటి వారిని తమ ప్రభుత్వ వచ్చాక వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ముందుగా మందా సాల్మన్ బంధువులను, అదే హాస్పటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మోర్జంపాడు గ్రామానికి వైఎస్సార్ సీపీ నాయకుడు చిన్న సాంబయ్యను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ చింతపల్లి పెద సైదా, వైఎస్సార్ సీపీ పిడుగురాళ్ల మాజీ మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, మాచవరం మండల కన్వీనర్ మద్దు ప్రసాద్, రవీంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా
ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
బాపట్ల: బాపట్లలో క్రీడాకారుల కోసం క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బుధవారం వెటర్న్ క్రికెట్ మ్యాచ్ను ఎంపీ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్న్స్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన వారందరూ సంక్రాంతి పండుగ సొంత గ్రామానికి వచ్చి ఈ విధంగా మ్యాచ్ ఆడటం సంతోషదాయకమన్నారు. 12 సంవత్సరాల నుంచి బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వెటరన్ క్రికెట్ మీట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. యువ క్రీడాకారుల కోసం నెట్ ప్రాక్టీస్ నిమిత్తం వివేకానంద కాలనీలో స్థలాన్ని కేటాయించేందుకు ఆయన హామీ ఇచ్చారు. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీరామ్ చిట్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్న్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులందరికీ జేఎంటీ కోళ్లపూడి శ్రీనివాస్, సీఈఓ ఎంఎస్ చౌదరి, డీజీఎం సిహెచ్.బాలసుబ్రహ్మణ్యం, కె.వి.సత్యనారాయణ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునాథ్, సెక్రటరీ రామ్మోహన్ రావు , ట్రెజరర్ అబ్దుల్ కరీం, వైస్ ప్రెసిడెంట్ స్టాండ్లీ, మధు, సత్తిపండు పాల్గొన్నారు.
దాడులకు పాల్పడేవారిని వదిలేది లేదు


