కోడికత్తుల తయారీ ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: కోడి కత్తుల తయారీ ముఠాను నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది జిల్లావ్యాప్తంగా కోడి పందేలు జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కోడి పందేల నిర్వహకులు, కోడి కత్తులు తయారు చేసి సరఫరా చేసే వ్యక్తులు, కోడి పందేల కోసం బరులు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తిస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నల్లపాడు స్పెషల్ బ్రాంచ్ పోలీస్లకు అందిన సమాచారం మేరకు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాయుడుపేట, అంబేడ్కర్ కాలనీ (జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో)లో ఒక నివాసంలో కోడి కత్తులు తయారు చేస్తూ, వాటికి సాన పెట్టి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో సీఐ ఆదేశాలమేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ఇంటిపై దాడి నిర్వహించారు. దాడిలో గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన బండి బాలచంద్ర కోడి కత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తయరు చేసిన 60 కోడి కత్తులు, మూడు కోడి కత్తులకు సాన పెట్టే మిషన్లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం నిందితుడిని నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తూ జీవ హింసకు పాల్పడే వారిపట్ల ఎలాంటి సడలింపు ఉండదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.


