రూ.60.87 కోట్లకు వాహన డీలరు ఐపీ
302 మందికి నోటీసులు.. బాధితుల గగ్గోలు
నరసరావుపేట టౌన్ : ప్రముఖ ద్విచక్ర వాహన డీలరు ఐపీ నోటీసులు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రూ.60.87 కోట్లకు దివాళా తీసినట్లు కోర్టు నుంచి ఆయన నోటీసులు పంపడంతో వాటిని అందుకున్న బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వివరాలివీ.. యర్రంశెట్టి బాబ్జి, యర్రంశెట్టి రాము సోదరులు. రావిపాడు రోడ్డులో వీరు ద్విచక్ర వాహన షోరూం నిర్వహించారు. కొన్నేళ్లుగా నమ్మకంగా వ్యాపారం చేస్తూ అప్పులు చేశారు. వడ్డీలు చెల్లించటం నిలిపివేయడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో నాలుగు నెలల కిందట కుటుంబంతో సహా వీరిరువురూ అజ్ఞాతంలోకి వెళ్లారు. వ్యాపారంలో నష్టాలు చూపి ఐపీ దాఖలు చేశారు. నాలుగు రోజులుగా ఒకొక్కరికి ఐపీ నోటీసులు అందుతున్నాయి. దీంతో.. బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 302 మంది వద్ద అప్పుగా రూ.60,87,00,000 తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన వారిలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. అవసరానికి ఉపయోగపడతాయని వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఐపీ దాఖలుతో ఇక రావని తెలిసి వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆరుగురు అరెస్టు
మాచవరం: మండలంలోని సింగరాయపాలెం తండా శివారులోని సింగరుట్ల కొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే విశ్వనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు. నిందితులకు సంబంధించిన నాలుగు ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఆలయ పూజారి అడుసుమల్లి శరత్బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
దుర్గి: దుర్గికి చెందిన వ్యక్తి అడిగొప్పల బస్టాండ్ సెంటర్లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గికి చెందిన గొర్రెబోయిన నాసరయ్య (50) మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అడిగొప్పల బస్టాండ్ సెంటర్లో ప్రమాదవశాత్తూ వాహనం అదుపుతప్పి కిందపడటంతో బైకు పై వెనుక కూర్చున్న నాసరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం నడుపుతున్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహానికి మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్య, నలుగురు సంతానం ఉన్నారు.
గుంటూరు మెడికల్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్ నాయక్ గురువారం గుంటూరు మెడికల్ కళాశాలను సందర్శించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యునికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కళాశాల సిబ్బందిని పరిచయం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మాట్లాడి ఆసుపత్రిలో ఏఏ సౌకర్యాలు వున్నాయి, ఇంకా ఏమైనా సౌకర్యాలు అవసరం అని అడిగి తెలుసుకున్నారు. జీజీహేచ్లో ట్రాన్స్ ప్లాంట్ థియేటర్, స్టాఫ్ని నియమించాలని జీజీహేచ్ సూపరింటెండెంట్ కమిషన్ సభ్యుని దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీ , పీహెచ్సీలు, స్కూల్స్, హాస్టల్ సందర్శించి అవసరమైన సౌకర్యాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కమిషన్ సభ్యులు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ మీకు ఏమైనా సమస్యలు వుంటే చెప్పవచ్చని, లేదా లిఖిత పూర్వకంగా తెలియజేసిన కమిషన్ పరిష్కరిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎస్టీ కమిషన్ – సమస్యలు, రోస్టర్ పాయింట్ సమస్యలు, స్కూల్స్, కాలేజీలలో ఏమైనా సమస్యలు వుంటే ఎస్టీ కమిషన్ కు అందించాలన్నారు. షెడ్యుల్ జాతులకు ఏమైనా న్యాయం జరుగకపోతే ఇరు పార్టీలను పిలిచి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కోర్టులలో సత్వర న్యాయం జరగడం లేదని, కమిషన్ను ఆశ్రయిస్తున్నారన్నారు. సమాజం కోసం కమిషన్ పని చేస్తుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. మెడికల్ కళాశాల ఎస్టీ విద్యార్దులకు లైజనింగ్ ఆఫీసర్, అసోసియేషన్ లు వుంటే గ్రీవెన్స్ను వాళ్ళే నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. అనంతరం విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకుల నుంచి వినతులను స్వీకరించారు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ మాధవి, డాక్టర్ శ్రీధర్, కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు, ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
రూ.60.87 కోట్లకు వాహన డీలరు ఐపీ


