
విద్యార్థినులకు కలెక్టర్ భరోసా
కారెంపూడి: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన కారెంపూడికి చెందిన కోనేటి కావ్యశ్రీ ఇంటిని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు శుక్రవారం సందర్శించారు. కారెంపూడి జెడ్పీ హై స్కూల్లో చదివిన కావ్యశ్రీ ఇటీవల ఫలితాల్లో 590 మార్కులు సాధించడంతో ఫలితాలు వెలువడిన రోజే బాలిక చదువుకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించి, దత్తత తీసుకున్నారు. కావ్యశ్రీ మున్ముందు ఏ కోర్సు చేయాలని భావిస్తున్నదో తెలుసుకునేందుకు కలెక్టర్ స్వయంగా శుక్రవారం విద్యార్థిని ఇంటికొచ్చారు. కావ్యశ్రీ తండ్రి రామయ్య గతంలోనే మృతి చెందగా, తల్లి కోటేశ్వరమ్మ ఉన్నారు. ఆమే ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. కావ్యశ్రీ తమ్ముడిని కూడా కలెక్టర్ దగ్గరకు తీసుకుని బాగా చదువుకోవాలని సూచించారు.
సివిల్ సర్వీసెస్కు సిద్ధమయ్యేలా సహకారం
అనంతరం ఒప్పిచర్ల గ్రామానికి కలెక్టర్ చేరుకున్నారు. పదో తరగతిలో 598 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర స్థాయి టాపర్గా నిలిచిన అంగడి పావని చంద్రిక ఇంటికి వెళ్లారు. పావనికి అభినందనలు తెలిపారు. ఆమె ఉన్నత చదువుల కోసం ఆర్ అండ్ బీ ఎస్ఈ రాజా నాయక్ దత్తత తీసుకున్న నేపథ్యంలో కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పావని తల్లిదండ్రుల కోరిక మేరకు సివిల్ సర్వీసెస్కు సన్నద్ధం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ పాల్గొన్నారు.

విద్యార్థినులకు కలెక్టర్ భరోసా