
అద్దంకిలో ఖర్జూరం సాగు
అద్దంకి: జిల్లాలో ఖర్జూరం సాగును రైతులు చేపట్టారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నకొత్తపల్లి గ్రామాల్లో మొత్తం ఐదు ఎకరాల్లో ఖర్జూర పంటను రైతులు సాగు చేశారు. ఈ తోటలు ప్రస్తుతం నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నాయి. అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు రెండు ఎకరాల్లో బరిహి రకం ఖర్జూరం పంటను, తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ దగ్గర మొక్కను రూ.4500 చొప్పున కొనుగోలు చేసి తెచ్చి సాగు చేశాడు. ఈ తోట నాలుగు సంవత్సరాల వయసులో ఉంది. ఎండలు బాగా కాచి వాతావరణం అనుకూలంగా ఉంటే నాటిన మూడో సంవత్సరం నుంచే కాపుకు వస్తాయి. చెట్టుకు మొదటి సంవత్సరం 20 కిలోలు, రెండో సంవత్సరం 50, మూడో సంవత్సరం 100, అక్కడ నుంచి 300 కిలోల నుంచి 500 కిలోల వంతున 40 సంవత్సరాలపాటు దిగుబడిని ఇస్తాయి. కిలో ధర రూ.150 నుంచి 200 వరకు పలుకుతుంది. ఎకరాకు మొదటి సంవత్సరం రూ.75 వేలు ఆదాయం వస్తుంది.