
ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను ప్రభుత్వానికి అందజేయండి
సేకరించే స్టాల్ను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
నరసరావుపేట: పర్యావరణానికి ముప్పుగా పరిమణించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. ఈ మేరకు పట్టణంలోని స్టేషన్రోడ్డు గాంధీపార్కు వద్ద ఈ–చెక్ అనే థీమ్తో స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ–వ్యర్థాల సేకరణ స్టాల్ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి ఇళ్లు, హాస్పిటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల నుంచి పర్యావరణానికి హాని కలిగించేందుకు ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు, టీవీలు, రేడియో, మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, మైక్రో ఓవెన్లు, సీడీ ప్లేయర్లు, ఫ్యాన్లు తదితర వస్తువులను సేకరించారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను సందర్శించి అందులోని ఉత్పత్తులను పరిశీలించారు. కలెక్టరేట్లో ఈ–థీమ్పై సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను పరిశీలించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఈ వ్యర్ధాలపై ప్రభుత్వం పోరాడుతుందన్నారు. సేకరించిన వీటిలోని పనికివచ్చే వాటిని మహిళా సంఘాలకు ఇచ్చిన శిక్షణతో వేరుచేసి మిగతా వేస్ట్ను శాసీ్త్రయంగా నిర్మూలించటం జరుగుతుందన్నారు. దీని వలన చాలామందికి ఉపాధి లభిస్తుందన్నారు. రిపేరుచేసే షాపుల్లో పనికిరాని వాటిని వ్యాపారులు తెచ్చి ఇవ్వచ్చన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో స్వచ్చాంధ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. దీనిలో జేసీ సూరజ్ గనోరే, డీఆర్వో ఏకా మురళి, ఆర్డీవో కె.మధులత, మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు, ఆర్అండ్బీ ఈఈ రాజానాయక్ అధికారులు పాల్గొన్నారు.