రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సింగారి పంచాయతీలొ ఏనుగుల గుంపు బీభత్సాన్ని సృష్టించాయి. పాలఖమణ, టిక్రాపడ, పాద్రుగుడ, టిడిమాస్క సమీపంలోని అడవుల్లో 13 ఏనుగుల గుంపు మాకం వేశాయి. ఈ గుంపులో రెండు పిల్ల ఏనుగులు కూడా ఉన్నట్లు సమాచారం. అడవి నుంచి బయటకు వచ్చి పంటపొలాల్లో ప్రవేశించిన గుంపు చేతికొచ్చిన పంటను తినడంతో పాట తొక్కి, ధ్వంసం చేస్తూ పత్తితో పాటు వివిధ రకాల పంటలను నాశనం చేశాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలోనే ఉండటంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. ఏనుగుల భయంతో గ్రామస్తులు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పారాగార్డులు అక్కడికి చేరుకుని ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ సహాయంతో ఏనుగుల గుంపును సురక్షితంగా మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు పరిహారం అందించడంతో పాటు ఏనుగుల గుంపును సురక్షింతంగా తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


