జయపురం: జయపురం సమితి ఫూల్బెడలో గల ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రంలో జలం, మృత్తిక సంరక్షణ, యాజమాన్యం పై నిర్వహించిన రెండు రోజుల శిక్షణ శిబిరం నేడు ముగిసింది. ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం, జయపురం వారు బిజూ పట్నాయిక్ మెడికల్ ప్లాంట్ గార్డెన్ రీసెర్చ్ కేంద్రంలో నిర్వహించిన ఈ శిబిరంలో కొరాపుట్ జిల్లాలో కొరాపుట్, సెమిలిగుడ, నందపూర్, పొట్టంగి సమితుల నుంచి 50 మందికి పైగా వ్యవసాయంలో మంచి అనుభవం ఉన్న రైతులు పాల్గొన్నారు. శిబిరంలో స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ జయపురం కేంద్ర డైరెక్టర్ ప్రశాంత కుమార్ పరిడ ఈ కార్యక్రమం లక్ష్యాలను, ఉద్దేశాలను రైతుకు క్షుణ్ణంగా వివరించారు. పర్లాకిమిడి సెంచూరియన్ యూనివర్సిటీ యొక్క స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ ఫ్రఫుల్ల కుమార్ పండ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన పంటలకు ఆధారమైన భూమి స్వరూపం, రిమోట్ సెన్సింగ్లపై రైతులకు వివరించారు. స్వామినాథన్ సంస్థ కోఆర్డినేటర్ నిరంజన్ గౌడ మట్టి, నీరు సంరక్షణలో చెక్డ్యామ్, చెరువుల, బండరాళ్ల పాత్రపై శిబిరంలో పాల్గొన్న రైతులకు వివరించారు. అలాగే సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక చరణ్ లెంక వర్షపు నీరు సంరక్షణ, భూగర్భ జళాల పరిరక్షణలపై రైతులతో చర్చించారు. అనంతరం వ్యవసాయానికి సారవంతమైన భూమి, సాగునీరు అత్యంత ఆధారమైనవని వాటిపై రైతులకు అవగాహణ కలిగించేందుకు కార్యక్రమం నిర్వహించామని వెల్లడిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో సంస్థ ఉద్యోగులు దిలీప్ కుమార్ సుబుద్ది, దీప్తి సాహు, సంతోష్ కుమార్ సాహు, గోపీ గొల్లారి తదితరులు పాల్గొన్నారు.


