కొరాపుట్: రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి నిత్యానంద గొండో స్వస్థలం నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్కోట్లో ప్రతిపక్ష బీజేడీ పార్టీ ఆందోళన చేసింది. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ కి దిక్సూచి వంటి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణని విద్యాశాఖ గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ముద్రణలో అనేక తప్పులు దొర్లాయి. రాష్ట్ర ఖజానాకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఆ పుస్తకాలు పనికి రాకుండా పోయాయి. విద్యా మంత్రి అవినీతి పెరగడంతోనే ఈ అక్రమ ఒప్పందం జరిగిందని ప్రతిపక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేడీకి చెందిన విద్యార్థి, యువజన విభాగాలు తమ ఆందోళన కొనసాగిస్తాయని ప్రకటించారు. ఈ ఆందోళన నిత్యానంద గొండో రాజీనామా వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం ఉమ్మర్ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మజ్జి, విద్యా మంత్రి నిత్యానంద గొండో, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ ఆందోళనలో మాజీ ఎంఎల్ఎలు సదాశివ ప్రదాని, సుభాష్ గొండో తదితరులు పాల్గొన్నారు.


