రాయగడ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జియా హుల్ హక్ అన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో లక్ష్యం ఉంటుందని, ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవ్వడమే కాకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులకు కూడా అన్యాయం చేస్తోందని విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, వారికి తగిన ఫలితం అందకపోతే వారి పరిస్థిఽతి ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈనెల 24, 25, 26 తేదీల్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై అన్నిచోట్ల విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షి బాహిణీపతి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు శంకర్షన్ మంగరాజ్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు నిఖిల్ పట్నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నంది గౌరి తదితరులు పాల్గొన్నారు.


