ఆటోను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న కారు

Jun 25 2026 1:00 AM | Updated on Jun 25 2026 1:00 AM

మందస: మండలంలోని మకరజోల సమీపంలో జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో డ్రవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి

శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్రకే ప్రఖ్యాతిగాంచిన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్‌, అధ్యాపకులంతా సమష్టిగా కృషి చేయాలని కాలిజియేట్‌ ఎడ్యుకేషన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీవీ కృష్ణాజీ పేర్కొన్నారు. బుధవారం కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల పనితీరు, ఫలితాలు, అడ్మిషన్ల తీరు గురించి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యాళ్ల పోలినాయుడును అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రోణంకి హరిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ జి.రాజశేఖర్‌, అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంపతిరావు శశిభూషణ్‌, డాక్టర్‌ రామకృష్ణ, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించండి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం

యువకుడు మృతి

సారవకోట: మండలంలోని గోవర్ధనపురం రెవెన్యూ పరిధి అనవీర్‌ గ్రానైట్‌ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు జె.శ్రీకాంత్‌ రెడ్డి (23) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రానైట్‌ క్వారీలో ఎప్పటిలాగే బుధవారం విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌ రెడ్డి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సమీపంలో ఉన్న రాయి నీడలో సేద తీరేందుకు కూర్చున్నాడు. అయితే అదే రాయి ప్రమాదవశాత్తు ఆయనపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఒడిశాలోని గంజాం జిల్లా నరసింగపూర్‌గా గుర్తించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌, క్లూస్‌ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారావు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆదర్శనీయం

తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన ఉపాధ్యాయుడు

మందస: ప్రభుత్వ బడుల్లోని అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, కొత్తపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గవ్వ భీమారావు కోరారు. ఈ మేరకు మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తన చిన్న కుమారుడు గవ్వ తరుణ్‌ను 1వ తరగతిలో చేర్పించారు. పెద్ద కుమారుడు గవ్వ గిరీష్‌ కూడా అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. దీంతో ఆయనను పలువురు అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement